ఎదురెదురుగా వస్తున్న టూ వీలర్లు ఢీ, ఇద్దరు మృతి

ఎదురెదురుగా వస్తున్న టూ వీలర్లు ఢీ, ఇద్దరు మృతి
  • భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెంలో ఇద్దరు మృతి

దమ్మపేట, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని పెద్దగొల్లగూడెం శివారులో సోమవారం రాత్రి రెండు టూ వీలర్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు చనిపోయారు. మరొకరు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం... అప్పారావుపేటకు చెందిన రేగుల నర్సింహారావు (40), వెంకటేశ్వరరావు సోమవారం రాత్రి పెద్దగొల్లగూడెం వైపు నుంచి బైక్​పై అప్పారావుపేటకు వెళ్తున్నారు. అలాగే మల్కారం గ్రామానికి చెందిన  బుద్ధ పుల్లారావు(38) టూ వీలర్​పై దమ్మపేట నుంచి మల్కారం బయలుదేరాడు.

పెద్దగొల్లగూడెం ఊరు శివారుకు వచ్చే సరికి వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో వాహనాలు నడుపుతున్న నర్సింహారావు , పుల్లారావు అక్కడికక్కడే చనిపోయారు. వెంకటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని దవాఖానకు తరలించారు.  రెండు వాహనాలను నడుపుతున్న వారు మద్యం మత్తులో ఉండడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.