
ఒకవైపు ఎండలు మండుతున్నట్టుగా మరోవైపు నగరంలోని మార్కెట్ లో కూరగాయల ధరలు కూడా మండిపోతున్నాయి. బీన్స్, క్యారెట్, బెండకాయ తదితర కూరగాయల ధరలు ఇప్పటికే భారీగా పెరిగాయి. బీన్స్ కిలోకు వంద రూపాయలు పలుకుతుంది.
అదేవిధంగా, గత రెండు వారాల్లో పుదీనా, కొత్తిమీర ధరలు కూడా పెరిగాయి. అకాల వర్షాలు , అధిక ఉష్ణోగ్రతలు, కూరగాయల కొరత, పెళ్లిళ్ల సీజన్ కారణంగా కూరగాయల ధరలు పెరిగాయని మదనపేట కూరగాయల మార్కెట్ వ్యాపారులు చెబుతున్నారు .
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు, వడగళ్ల వానల కారణంగా మామిడికాయల రాక తగ్గడంతో మామిడి పండ్ల ధరలు కూడా పెరిగాయి. ఊరగాయల తయారీలో ఉపయోగించే నాటు రకం పచ్చి మామిడికాయలు ఒక్కొక్కటి రూ.10 నుంచి రూ.12 వరకు విక్రయిస్తున్నారు. గతేడాది రూ.5 చొప్పున విక్రయించామని వ్యాపారులు చెబుతున్నారు. అటు నిమ్మకాయలకు ఫుల్ డిమాండ్ ఉంది.
ఈ ఏడాది మార్చిలో నిమ్మకాయలు ఒక్కొక్కటి రూ.3కు విక్రయించగా ప్రస్తుతం 5 చొప్పున విక్రయిస్తున్నారు. పచ్చిమిర్చి, బంగాళదుంపలు కిలోకు రూ. 35 నుంచి రూ. 40 చొప్పున విక్రయిస్తున్నారు. ఇక టమాటా చాలా కిలో రూ.15 నుండి రూ.20 వరకు పలుకుతోంది. పెరిగిన ధరలు రైతులకు మేలు చేసిన కొనుక్కునే ప్రజలు మాత్రం ధరలను చూసి భయపడిపోతున్నారు.