
- గవర్నర్కు విశ్వహిందూ పరిషత్ వినతిపత్రం
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్రంలో గోవులకు రక్షణ కరువైందని, గోరక్ష చట్టాలు ఉన్నప్పటికీ వాటిని సరైన రీతిలో అమలు చేయడం లేదని విశ్వహిందూ పరిషత్ ఆరోపించింది. గోవులకు రక్షణ కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ను కోరింది. మంగళవారం విశ్వహిందూ పరిషత్ నాయకులు రాజ్భవన్లో గవర్నర్ను కలిసి, వినతిపత్రం ఇచ్చారు. ఆవును హిందువులు ఆరాధిస్తారని, కానీ, అలాంటి గోమాతను రక్షించడానికి కాంగ్రెస్ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు.
ఓటు బ్యాంకు రాజకీయాలతో కాంగ్రెస్ ప్రభుత్వం గోరక్షణలో విఫలమవుతోందన్నారు. గోరక్షణ కోసం చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా అవి నామమాత్రంగానే ఉన్నాయన్నారు. అలాగే వేములవాడ దేవాలయ గోశాలలో నిత్యం కోడెలు మరణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై దేవాదాయ శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి, కమిషనర్ ఇతర అధికారులు ఎవరూ స్పందించడం లేదన్నారు. గవర్నర్ ను కలిసిన వారిలో ఆర్ఎస్ఎస్ నాయకులు ఆకుతోట రామారావు, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు రామరాజు, యాదగిరిరావు, డాక్టర్ రామ్ సింగ్, రమేశ్, పగడాకుల బాలస్వామి ఉన్నారు.