వనపర్తి జిల్లా వార్షిక రుణప్రణాళిక రూ.5290.33 కోట్లు : కలెక్టర్ ఆదర్శ్ సురభి

 వనపర్తి జిల్లా వార్షిక రుణప్రణాళిక రూ.5290.33 కోట్లు : కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, వెలుగు: 2025-–26  ఆర్థిక సంవత్సరానికి వనపర్తి జిల్లాలో రూ. 5290.33 కోట్ల వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రకటించారు.  మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి బ్యాంకర్ల  సంప్రదింపుల సమన్వయ సమావేశం జరిగింది. సమావేశంలో రూ. 5290.33 కోట్ల  వార్షిక రుణ ప్రణాళికను ప్రకటించారు. గత సంవత్సరం కంటే రూ.928.67 కోట్లు అధికమని, ఇందులో అత్యధికంగా రూ. 3982.31 కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించినట్లు తెలిపారు. 

ఎంఎస్ఎంఈ  కింద రూ.429.50 కోట్లు, ప్రయారిటీ సెక్టార్ కింద విద్య, గృహ నిర్మాణానికి రూ. 193.77 కోట్లు కేటాయించామన్నారు. తక్కువ డబ్బులతో అత్యధికంగా లబ్ధి చేకూరే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన,  ప్రధానమంత్రి సురక్ష యోజన బీమాను జిల్లాలోని బ్యాంక్ ఖాతాలు ఉన్న ప్రతి ఒక్కరికి చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి బ్యాంకర్లను ఆదేశించారు.  ప్రధానమంత్రి సురక్ష యోజన బీమా చేయించడానికి చెల్లించాల్సిన డబ్బులు సంవత్సరానికి కేవలం రూ.20 మాత్రమేనని ప్రధాన మంత్రి జీవన్ జ్యోతికి రూ.436 గా తెలిపారు.  ప్రమాదవశాత్తూ  ఏమైనా జరిగితే ఒక్కో బీమా పాలసీ నుంచి రూ. 2 లక్షలు చొప్పున వస్తాయన్నారు. 

బ్యాంకర్లు నిర్లక్ష్యం వల్ల ఖాతాదారులకు బీమా చేయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఖాతాదారులకు బ్యాంకర్లు అవగాహన కల్పించాలన్నారు. వచ్చే సమావేశం వరకు బీమా చేసిన వారి సంఖ్య  గణనీయంగా పెరగాలని లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి కోసం చేసుకున్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించి రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. వ్యవసాయ రంగానికి రైతులకు రుణాలు ఇవ్వాలని సూచించారు. సమావేశంలో అడిషనల్​కలెక్టర్ యాదయ్య, డిప్యూటీ రీజినల్ అధికారి మురళీ కృష్ణ, చీఫ్ మేనేజర్ లోకేశ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకుమార్, డీఆర్డీఓ పీడీ ఉమాదేవి జిల్లా ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.