- ఇటిక్యాల ఎంఎస్ ఇండస్ట్రీస్ ఎదుట ఆందోళన
- సూపర్వైజర్పై పీఎస్లో ఫిర్యాదు
పుల్కల్, వెలుగు: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఇటిక్యాల(ఎస్) గ్రామ శివారులోని ఎంఎస్ ఇండస్ట్రీస్ లో సూపర్ వైజర్ రవి మహిళా కార్మికులపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ వారు ఫ్యాక్టరీ గేటు ఎదుట ఆందోళనకు దిగారు. గురువారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు వచ్చిన మహిళా కార్మికులు గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ శ్రీనివాస్ వద్ద సూపర్ వైజర్ గా పనిచేస్తున్న రవి తమ పట్ల అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. అతడిని వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకు మండుటెండలో ఆందోళన కొనసాగించారు.
సూపర్ వైజర్ ను వారం రోజుల్లో తొలగిస్తామని పరిశ్రమ యాజమాన్యం చెప్పినా మహిళా కార్మికులు అంగీకరించలేదు. వెంటనే తొలగించి కేసు నమోదు చేయాలని పట్టుబట్టారు. యాజమాన్యం స్పందించకపోవడంతో దాదాపు 200 మంది కార్మికులు పుల్కల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సీఐటీయూ అందోల్ డివిజన్ కార్యదర్శి విద్యాసాగర్ వారికి మద్దతు తెలిపారు.
