HYDRA: 1961 నాటి ఆక్రమణల కూల్చివేత

HYDRA: 1961 నాటి ఆక్రమణల కూల్చివేత
  • ఎల్లారెడ్డిగూడలో 1533 గజాల పార్కును అందుబాటులోకి తెచ్చిన హైడ్రా

హైదరాబాద్ సిటీ, వెలుగు: మధురనగర్ మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలోని ఎల్లారెడ్డిగూడలో పార్కు ఆక్రమణలను ఆదివారం  హైడ్రా అధికారులు తొలగించారు.1961 నుంచి ఉన్న ఈ ఆక్రమణలను తొలగించి పార్కు భూమిని కాపాడారు. సాయి సారధినగర్ రెసిడెంట్స్ వెల్ఫెర్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదుపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ విచారించారు. ఆక్రమణకు గురైందని గుర్తించి కూల్చివేతలకు ఆదేశించడంతో ఆక్రమణలను తొలగించారు. 

1961లో 5 ఎకరాల విస్తీర్ణంలో సాయి సారధినగర్ పేరిట 35 ప్లాట్లతో లేఅవుట్ వేశారు.  ఇందులో 1533 గజాల స్థలాన్ని పార్కుగా చూపారు.  ప్లాట్లను విక్రయించిన తరువాత లేఅవుట్ వేసిన నారాయణ ప్రసాద్ వారసులు పార్కు స్థలాన్ని ఆక్రమించి షెడ్డు నిర్మించారు. దానికి ఇంటి నంబర్ కూడా తెచ్చుకున్నారు. ఈ విషయంపై పలుమార్లు జీహెచ్ఎంసీ అధికారులకు కాలనీవాసులు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో సాయి సారధి నగర్ నివాసితులు హైడ్రాను ఆశ్రయించారు. 

దీంతో హైడ్రా ఆక్రమణలను తొలగించడంతో  పాటు ప్రొటెక్టెడ్ బై హైడ్రా అని అక్కడ బోర్డు ఏర్పాటు చేశారు. ఆక్రమణల కూల్చివేతపై  స్థానికలు హర్షం వ్యక్తం చేశారు. 60 ఏండ్ల పోరాట ఫలితమంటూ హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.