V6 News

1.21 లక్షల టన్నుల ప్లాస్టిక్​ వేస్ట్ ను​ తెచ్చుకున్నం..

1.21 లక్షల టన్నుల ప్లాస్టిక్​ వేస్ట్ ను​ తెచ్చుకున్నం..

1.21 లక్షల టన్నులు.. గుట్టు చప్పుడు కాకుండా ఇండియాలోకి దిగుమతి అయిన ప్లాస్టిక్​ వేస్ట్​ ఇది. కంపెనీలు, రీసైక్లింగ్​ యూనిట్లు ఇబ్బడిముబ్బడిగా ఎవరికీ తెలియకుండా ఈ ప్లాస్టిక్​ వేస్ట్​ను దిగుమతి చేసుకున్నట్టు పండిట్​ దీన్​దయాళ్​ ఉపాధ్యాయ్​ స్మృతి మంచ్​ (పీడీయూఎస్​ఎం) అనే స్వచ్ఛంద సంస్థ చేసిన స్టడీలో తేలింది. దాని వల్ల ప్లాస్టిక్​ను నియంత్రించాలన్న లక్ష్యం నీరుగారిపోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. పాకిస్థాన్​, బంగ్లాదేశ్​ నుంచే 55 వేల టన్నుల ప్లాస్టిక్​ వ్యర్థాలను దిగుమతి చేసుకున్నట్టు చెప్పింది. ఒక్క ఢిల్లీలోకే 19 వేల టన్నులు వస్తోందని  తెలిపింది. మిడిల్​ ఈస్ట్, యూరప్​, అమెరికా సహా 25 దేశాల నుంచి ఇండియాకు వచ్చి చేరుతోందని పేర్కొంది.

వాడిపారేసిన పెట్​ బాటిళ్లను ముక్కలు, ముద్దలుగా టన్నుల కొద్దీ కంపెనీలు తెప్పించుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. రోజూ టన్నుల కొద్దీ ప్లాస్టిక్​.. భూమి, సముద్రాల్లో పేరుకుపోతోందని,  ఈ కొత్త చెత్తతో పరిస్థితి మరింత దిగజారుతోందని పేర్కొంది. విదేశాల నుంచి తెప్పించుకుంటే తక్కువ ఖర్చుతో అయిపోతుందన్న ఉద్దేశంతోనే కంపెనీలు ఇలా చేస్తున్నాయని తెలిపింది.