జై శ్రీరాం : అయోధ్యకు 100 రోజుల్లో.. వెయ్యి రైళ్లు

జై శ్రీరాం : అయోధ్యకు 100 రోజుల్లో.. వెయ్యి రైళ్లు

ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని నిర్మిస్తోన్న రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.  వచ్చే ఏడాది జనవరి 22న  ఆలయ ప్రతిష్ఠకు ముహూర్తంగా నిర్ణయించారు.  ఈ మహాక్రతువు దేశంలోని వివిధ ప్రాంతాలనుండి  పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది.  ఈ క్రమంలో  అయోధ్యకు మొదటి వంద రోజుల్లో 1,000 రైళ్లను నడపాలని భారతీయ రైల్వే యోచిస్తోంది.  ఈ రైళ్లు జనవరి 19 నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 22న ప్రతిష్ఠ జరిగిన మర్నాడు నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతించనున్నారు.

ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, పుణే, కోల్‌కతా, నాగ్‌పూర్, లక్నో, జమ్మూ సహా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి అయోధ్యకు రైళ్లను నడపనున్నట్టు తెలుస్తోంది. డిమాండ్ ను బట్టి రైళ్ల సంఖ్యను పెంచే అవకాశం కూడా ఉంది. కొన్ని రైళ్లను యాత్రికుల బృందాలు కూడా అయోధ్యకు చార్టర్డ్ సర్వీస్‌గా బుక్ చేస్తున్నాయని వర్గాలు తెలిపాయి. ఐఆర్సీటీసీ కూడా పెద్ద సంఖ్యలో యాత్రికులు సందర్శించే ఈ 10-15 రోజులలో క్యాటరింగ్ సేవలను అందించడానికి కూడా సిద్ధమవుతోంది.   డిమాండ్‌కు తగ్గట్టుగా అనేక ఫుడ్ స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తుంది.

శ్రీరాముడి భక్తుల దశాబ్దాల నిరీక్షణ 2024 జనవరితో ముగియనుంది. 2024 జనవరి 22న గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 14న మకర సంక్రాంతి తర్వాత రామ్‌ లల్లా ప్రతిష్ఠాపన ప్రక్రియను ప్రారంభించి, 10 రోజుల పాటు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలయ ట్రస్టు నిర్ణయించింది.  ఆలయ గర్భగుడి వద్ద రామ్ లల్లా విగ్రహాన్ని  మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ శ్యామశీల నిర్మించారు.