బెంగళూరు: గతేడాది ఐపీఎల్ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన 11 మంది బాధితులకు నివాళిగా ఆర్సీబీ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో 11 సీట్లను ఖాళీగా ఉంచనుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్కు ముందు జరిగే ప్రాక్టీస్ సెషన్లో ప్లేయర్లంతా 11వ నంబర్ జెర్సీలో దర్శనమివ్వనున్నారు.
అలాగే ‘ప్రాక్టీస్ టైమ్లో మా ప్లేయర్లందరూ జెర్సీ నంబర్11ను ధరిస్తారు. మా ప్రయాణంలో ఎల్లప్పుడూ భాగమై ఉండే మా అభిమానులకు ఇది ఒక నివాళి. ఆ రోజు బ్లాక్ ఆర్మ్బ్యాండ్స్ను కూడా ధరిస్తారు. చిన్నస్వామి స్టేడియంలో 11 సీట్లను శాశ్వతంగా ఖాళీగా ఉంచాలని చూస్తున్నాం. ఎప్పటికీ మాతో ఉండే ఆ 11 మంది అభిమానుల కోసం ఇది చేస్తున్నాం’ అని ఆర్సీబీ సీఈవో రాజేశ్ మీనన్ వెల్లడించాడు. ఈసారి అన్బాక్స్ కార్యక్రమం ఉండదని స్పష్టం చేశాడు. ఈ నెల 28న చిన్నస్వామిలో సన్రైజర్స్ హైదరాబాద్తో ఆర్సీబీ తొలి మ్యాచ్ ఆడనుంది.
