తెలంగాణ రాష్ట్రంలో 8 నెలల్లో 1.11 లక్షల ఫోన్లు చోరీ

తెలంగాణ రాష్ట్రంలో 8 నెలల్లో 1.11 లక్షల ఫోన్లు చోరీ
  • 53,107 ఫోన్లు ట్రేస్.. 25,130 రికవరీ చేసిన స్టేట్  సీఐడీ పోలీసులు
  • సీఈఐఆర్ పోర్టల్‌ ద్వారా మొబైల్స్ బ్లాకింగ్‌
  • చోరీకి గురైన ఫోన్ల రికవరీలో స్టేట్ ​సీఐడీ పోలీసులు సక్సెస్​

హైదరాబాద్‌ సిటీ క్రైం/గచ్చిబౌలి, వెలుగు:గత ఎనిమిది నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1.11లక్షల సెల్​ఫోన్లు చోరీకి గురయ్యాయి. వీటిలో 25,130 ఫోన్లను సీఐడీ పోలీసులు రికవరీ చేశారు. 53,107 ఫోన్లను ట్రేస్​చేసి, బాధితులకు సమాచారం అందించారు. స్టేట్​పోలీసులు చోరీకి గురైన, మిస్సింగ్​ఫోన్లను గుర్తించేందుకు పోలీసులు (సీఈఐఆర్)సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్​ను వినియోగిస్తున్నారు. దీని ద్వారా ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈ నెల 23 వరకు 1,10,974 ఫోన్లను బ్లాక్ చేశారు. 25,130 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. అలాగే గత 15 నెలల్లో 97 వేల ఫోన్లను రికవరీ బాధితులకు అప్పగించారు.

  • సీఈఐఆర్ ఆపరేషన్స్

గతేడాది ఏప్రిల్‌13న అప్పటి డీజీపీ అంజనీకుమార్ ఆధ్వర్యంలో సీఈఐర్‌‌పై పోలీసులకు ప్రత్యేక ట్రైనింగ్ నిర్వహించారు. సీఐడీ చీఫ్ మహేశ్​ భగవత్ నోడల్ ఆఫీసర్‌‌గా 2023 మే17న అధికారికంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 యూనిట్లను ఏర్పాటు చేసి, 780 పోలీస్‌స్టేషన్లలో   సీఈఐఆర్ పోర్టల్ యూజర్ ఐడీలను ప్రజలకు అందుబాటులో ఉంచారు. జిల్లాల వారీగా ప్రత్యేక నోడల్ ఆఫీర్లను నియమించారు. సీఐడీ ఆఫీస్‌ నుంచి సెల్‌ట్రేసింగ్ ఆపరేషన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సీఐడీ నోడల్ ఆఫీసర్‌‌గా శిఖాగోయల్‌ వ్యవహరిస్తున్నారు. సీఐడీ ఆఫీసులోని మెయిన్ సర్వర్‌‌తో పోర్టల్ ఆపరేట్ చేస్తున్నారు. పోలీసులు టెలికాం శాఖ(డీఓటీ)తో కలిసి సీఈఐఆర్ పోర్టల్‌ను తెలంగాణ పోలీస్ సిటిజన్ పోర్టల్‌తో అటాచ్​చేశారు.

  • సెల్​ఫోన్​పోతే ఇలా చేయండి

సెల్​ఫోన్​పోగొట్టుకున్నా, చోరికి గురైనా వెంటనే www.tspolice.gov.in లేదా www.ceir.gov.in వెబ్‌సైట్లలో ఫిర్యాదు చేయొచ్చు. అలాగే స్థానిక పోలీస్ స్టేషన్స్‌లోని సీఈఐఆర్‌‌టీమ్‌ను కలిసి ఫిర్యాదు అందజేయొచ్చు. బాధితుల ఆధార్‌‌కార్డ్‌, మొబైల్‌ ఫోన్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు ఇస్తే.. వెంటనే చోరీకి గురైన ఫోన్లను బ్లాక్ చేస్తారు. ఫోస్ ట్రేసింగ్‌స్టేటస్‌ను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. 

  • సైబరాబాద్​లో 570 సెల్​ఫోన్లు రికవరీ

సైబరాబాద్​కమిషనరేట్​పరిధిలో గడిచిన 25 రోజుల్లో చోరీకి గురైన 570 సెల్​ఫోన్లను రికవరీ చేసినట్లు క్రైమ్ డీసీపీ కె.నర్సింహ తెలిపారు. సీఈఐఆర్(సెంట్రల్​ఎక్విప్​మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్​ను ఉపయోగించి సెల్​ఫోన్లను ట్రేస్​చేసినట్లు చెప్పారు. 570 ఫోన్ల విలువ రూ.1.50 కోట్లు ఉంటుందన్నారు. వీటిలో మాదాపూర్​సీసీఎస్​పోలీసులు101, రాజేంద్రనగర్​సీసీఎస్​నుంచి 87, శంషాబాద్​సీసీఎస్ నుంచి 100, మేడ్చల్​సీసీఎస్​నుంచి 95, బాలానగర్ సీసీఎస్ నుంచి 97, ఐటీ సెల్​ద్వారా 90 సెల్​ఫోన్లను రికవరీ చేసినట్లు వెల్లడించారు. గత 8 నెలల్లో సైబరాబాద్​పోలీసులు 2,696 సెల్​ఫోన్లు 
రికవరీ చేశారని స్పష్టం చేశారు. 

  •  ఫోన్లు చోరీకి గురైతే

‘‘ ఫోన్లు చోరీకి గురైన వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలి. సీఈఐఆర్‌‌ పోర్టల్‌ ద్వారా మొబైల్‌ ఫోన్ పనిచేయకుండా చేస్తాం. మొబైల్ ట్రేస్ అయిన వెంటనే బాధితుల నంబర్‌‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే తప్ప మొబైల్ డివైజ్ పనిచేయదు. మొబైల్‌లో వేసిన నంబర్‌‌ ద్వారా రికవరీ చేస్తాం.’’
– శిఖాగోయల్‌, సీఐడీ చీఫ్‌