ఆర్టీసీ కార్మికుల సమ్మె 11వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కార్మికుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇవాళ డిపోల ముందు మనవహారాలు, రాస్తారోకోలు నిర్వహించనున్నారు జేఏసీ నేతలు. మరోవైపు ఉదయం నుంచే పలు డిపోల దగ్గర నిరసనలు తెలుపుతున్నారు కార్మికులు. బస్సులు బయటకు రానివ్వకుండా డిపోల ముందు ధర్నాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ సమ్మె, కార్మికుల డిమాండ్లు, సెల్ఫ్ డిస్మిస్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది.
డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న జేఏసీ నేతలు…కార్మికులెవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచిస్తున్నారు. మరోవైపు కార్మికుల సమ్మెకు అన్ని పార్టీలతో పాటు ప్రజల నుంచి మద్దతు పెరుగుతోంది. సర్కార్ తీరుకు నిరసనగా హుజుర్ నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు విరమించుకుంది సీపీఐ. ఇవాళ్టీ నుంచి పూర్తి స్థాయిలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా పూర్తి స్థాయిలో ఆందోళనల్లో పాల్గొనాలని నిర్ణయించింది.