
- చివరి రోజే నామినేషన్ వేసిన 58 మంది
హాలియా వెలుగు: నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజైన మంగళవారం 58 మంది క్యాండిడేట్లు 105 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తంగా 78 మంది 128 సెట్ల నామినేషన్లు వేసినట్టు రిటర్నింగ్ ఆఫీసర్ రోమిత్ సింగ్ తెలిపారు. ప్రధాన పార్టీల క్యాండిడేట్లందరూ చివరి రోజే నామినేషన్లు దాఖలు చేశారు. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలతో వచ్చి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కుమార్ 3 సెట్ల నామినేషన్లు వేశారు. బీజేపీ క్యాండిడేట్ పానుగోతు రవికుమార్ నాయక్ కూడా మంగళవారమే నామినేషన్ వేశారు. ఆయనతో పాటు పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్, పార్టీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలంగౌడ్, పార్టీ నేతలు గొంగిడి మనోహర్రెడ్డి, సంకినేని వెంకటేశ్వర్రావు హాజరయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, పీసీసీ కార్యదర్శి కొండేటి మల్లయ్యతో వచ్చి ఆ పార్టీ క్యాండిడేట్ జానారెడ్డి నామినేషన్ వేశారు. కరోనా రూల్స్ పాటించాలని అధికారులు చెప్పినా పార్టీల నేతలు వందల సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీలు నిర్వహించారు. పటాకులు పేల్చారు.
ఇన్నేళ్లలో బీజేపీనే గిరిజనులకు చాన్స్ ఇచ్చింది: రవికుమార్ నాయక్
నియోజకవర్గంలోని 40 వేల మంది ఎస్టీ సామాజిక వర్గం ప్రజలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారని, ఇప్పటివరకు ఏ పార్టీ కూడా గిరిజనుడిని ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబెట్టలేదని బీజేపీ క్యాండిడేట్ రవికుమార్ అన్నారు. బీజేపీ మాత్రమే గిరిజనులను గుర్తించి తనకు టికెట్ ఇచ్చిందన్నారు. ఎన్నికలంటే డబ్బు, మందు, బెదిరింపులు కాదని.. పార్టీలు తాము చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓట్లను అడగాలని కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి అన్నారు. క్యాండిడేట్లు నామినేషన్లు వేసి తమ పార్టీ ఆఫీసులకు చేరుకోవాలని, ఎవరు అభివృద్ధి చేస్తే ప్రజలు వాళ్లను గెలిపిస్తారని, ఈ ప్రయత్నంతో దేశంలో ఆదర్శంగా సాగర్ బై పోల్ నిలవాలన్నారు. నర్సింహయ్య వారసుడిగా తనను ఆశీర్వదించాలని నియోజకవర్గ ప్రజలను టీఆర్ఎస్ క్యాండిడేట్ భగత్ కోరారు. తన తండ్రి ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ అమలు చేశారన్నారు. నెల్లికల్ లిఫ్టును త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. సాగర్ టెయిల్ ఎండ్ భూములకు నీరిచ్చిన ఘనత తమ పార్టీదేనని అన్నారు.