చెరుకుతోటలో 13 ఏళ్ల బాలికపై రేప్

చెరుకుతోటలో 13 ఏళ్ల బాలికపై రేప్

ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో దారుణం జరిగింది. ఓ 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి బాలిక గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

నేపాల్ సరిహద్దుకు దగ్గర్లో మరియు లక్నోకు 130 కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. శుక్రవారం బాలికను అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బలవంతంగా వారి చెరుకు తోటలోకి లాక్కెళ్లి రేప్ చేశారు. ఆ తర్వాత బాలికను హత్యచేసి పారిపోయారు. ఆమె తల్లిదండ్రులు బాలికను వెతుకుతుండగా శనివారం మృతదేహం లభించింది.

‘శుక్రవారం మధ్యాహ్నం నా కూతురు తప్పిపోయింది. నా బిడ్డను రేప్ చేసి హత్య చేశారు. కళ్లలో పొడిచి, నాలుకను కత్తిరించారు’ అని బాలిక తండ్రి తెలిపాడు. అయితే శనివారం సాయంత్రం వచ్చిన పోస్టుమార్టం నివేదికలో మాత్రం అలా ఏం జరగలేదని, రేప్ చేసి గొంతు కోసి చంపినట్లు పోలీసులు తెలిపారు. కళ్ల దగ్గర గీతలు ఉన్నాయి. చెరుక ఆకులు కోసుకోవడం వల్ల ఆ గీతలు పడి ఉండవచ్చని ఖేరి ఎస్పీ సతేంద్ర కుమార్ తెలిపారు.

‘పోస్టుమార్టం ద్వారా బాలికపై అత్యాచారం జరిగిందని నిర్ధారణకువచ్చాం. ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్టు చేశాం. వారిపై అత్యాచారం, హత్య మరియు జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశాం’ అని జిల్లా పోలీసు చీఫ్ తెలిపారు.

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఈ సంఘటనను ట్విట్టర్లో ఖండించారు. ‘ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే సమాజ్ వాదీ పార్టీకి, ప్రస్తుత బీజేపీకి తేడా ఏంటి?’అని ఆమె యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విరుచుకుపడింది.

ఈ సంఘటనపై భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కూడా స్పందించారు. ‘బీజేపీ ప్రభుత్వంలో దళితుల అణచివేత తారాస్థాయికి చేరుకుంది. రాష్ట్రం అడవిలా మారింది. ఈ ప్రభుత్వంలో మా బిడ్డలు సురక్షితంగా లేరు. మా ఇళ్ళు కూడా సురక్షితంగా లేవు. ప్రతిచోటా భయపడే వాతావరణం ఉంది. వెంటనే సీఎం యోగి ఆదిత్యనాథ్ తన పదవికి రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు.

గత వారం కూడా యూపీలోని హాపూర్‌లో 6 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. పోలీసులు నిందితులను శుక్రవారం అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆ బాలికకు ఒక శస్త్రచికిత్స జరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. బాలిక ఇంకా ప్రమాదం నుండి బయటపడలేదని వైద్యులు అంటున్నారు.

For More News..

రిటైర్ మెంట్ పై ధోని భార్య హార్ట్ ఫెల్ట్ పోస్ట్

భారీ వర్షాలకు నీటమునిగిన లక్నవరం కేబుల్ బ్రిడ్జ్

వాజ్‌పేయికి నివాళులర్పించిన ప్రధాని మోడీ, రాష్ట్రపతి కోవింద్