- రిపోర్టులకు, ఫిర్యాదులకు మొబైల్ యాప్ సిద్ధం
- ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు వెల్లడి
- గ్రేటర్లో 10 మినీ డయాగ్నస్టిక్ హబ్స్ ప్రారంభం
- ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఈసీజీ సేవలు అందుబాటులోకి
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ డయాగ్నస్టిక్ హబ్స్లో ప్రస్తుతం 57 రకాల టెస్టులు చేయిస్తున్నామని, త్వరలో టెస్టుల సంఖ్యను134కు పెంచుతామని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 10 మినీ డయాగ్నస్టిక్ హబ్స్ను బుధవారం ఏకకాలంలో పలువురు నేతలు ప్రారంభించారు. నార్సింగిలోని హబ్ను మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్తో కలిసి హరీశ్రావు ప్రారంభించారు. ‘తెలంగాణ డయాగ్నస్టిక్స్’ మొబైల్ యాప్ను కూడా మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్తీ ప్రజల కోసం బస్తీ దవాఖాన్లు ప్రారంభించామని, టెస్టుల కోసం డయాగ్నస్టిక్ హబ్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మినీ హబ్స్లో ఎక్స్రే, ఈసీజీ, ఆల్ట్రాసౌండ్ స్కాన్ అందుబాటులో ఉంటాయన్నారు. టెస్టుల రిపోర్ట్లను చూసుకునేందుకు, భద్రపర్చుకునేందుకు తెలంగాణ డయాగ్నస్టిక్స్ మొబైల్ యాప్ను తెచ్చామన్నారు. ఈ యాప్లో అన్ని హబ్ల లొకేషన్లు, రూట్మ్యాప్లు ఉంటాయన్నారు. పేషెంట్ ఐడీ ద్వారా పాత రిపోర్టులు, కొత్త రిపోర్టులు చూసుకోవచ్చన్నారు. ఏదైనా సమస్య ఉంటే ఇదే యాప్ ద్వారా ఫిర్యాదులు కూడా చేయొచ్చునన్నారు. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా యాప్లో నమోదు చేయాలని ప్రజలకు సూచించారు. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు తమ పరిధిలోని హాస్పిటళ్లను రెగ్యులర్గా విజిట్ చేసి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
నేడు మీల్ స్టాల్స్ ప్రారంభం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 18 దవాఖాన్లలో రూ.5 భోజన కేంద్రాలను గురువారం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గాంధీ, ఉస్మానియా, నిమ్స్, గచ్చిబౌలి టిమ్స్, నిలోఫర్, ఎంఎన్జే, కోఠి ఈఎన్టీ, కింగ్ కోఠి, ఫీవర్, చెస్ట్, పేట్లబుర్జు, సుల్తాన్బజార్ మెటర్నిటీ ఆస్పత్రులు, మలక్పేట, గోల్కొండ, వనస్థలిపురం, కొండాపూర్, నాంపల్లి ఏరియా హాస్పిటల్స్లో మీల్స్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. వీటిలో రోజూ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం పెట్టనున్నారు. ప్రతిసారి రూ.5 చెల్లిస్తే సరిపోతుంది. కాగా, బుధవారం అమీర్పేట్, శేరిలింగంపల్లి, అల్వాల్, కుషాయిగూడ, పటాన్చెరు, మలక్పేట్, హయత్నగర్, రాజేంద్రనగర్, గోల్కొండ, నార్సింగిలో మినీ డయాగ్నస్టిక్ హబ్స్ ప్రారంభమయ్యాయి.
ఈహెచ్ఎస్ పై త్వరలో ఉత్తర్వులు
ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఉద్యోగులు బేసిక్ శాలరీ నుంచి 1 శాతం ఈహెచ్ఎస్ కు ఇవ్వాలని పీఆర్సీ సిఫార్సు చేయగా.. 2 శాతం ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. దీనికి ఉద్యోగులు అంగీకరించారు. బుధవారం టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్ తో పాటు నేతలు జగదీశ్వర్, సత్యనారాయణ గౌడ్ మంత్రి హరీశ్ రావును కలిసి ఈ మేరకు అంగీకార పత్రం అందజేశారు. ఈహెచ్ఎస్ ను ట్రస్ట్ బోర్డు ద్వారా అమలు చేయాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారని నేతలు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇకపై ఉచిత వైద్యం అందించాలని కోరగా మంత్రి అంగీకరించారని తెలిపారు.