ప్రియుడితో కలిసి తల్లిని చంపిన 15 ఏళ్ల బాలిక

ప్రియుడితో కలిసి తల్లిని చంపిన 15 ఏళ్ల బాలిక

తన ప్రేమకు ఒప్పుకోలేదని ప్రియుడితో కలిసి తల్లినే హతమార్చింది ఓ బాలిక. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని థాణే జిల్లాలో జరిగింది. ఉల్హాస్ నగర్‌కు చెందిన 40 ఏళ్ల మహిళ తన భర్తతో విడిపోయి.. 15 ఏళ్ల కూతురితో కలిసి ఉంటుంది. కుమార్తె స్థానికంగా ఉన్న జీన్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. అక్కడ బాలికకు 19 ఏళ్ల యువకుడితో పరిచయమైంది. అది కాస్తా వారిద్దరి మధ్య దూరాన్ని తగ్గించి ఒక్కటి చేసింది. ఈ విషయం తెలిసిన బాలిక తల్లి.. బాలిక మీద కోప్పడింది. వారి ప్రేమను తిరస్కరించింది. దాంతో బాలిక ఎలాగైనా తల్లిని అడ్డు తొలగించుకోవాలనుకుంది. 

బాలిక శనివారం మధ్యాహ్నం లంచ్ కోసం ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఇంటి తలుపులు మూయకుండా ఉంచింది. ఆ సమయంలో బాలిక ప్రియుడు ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి.. మహిళను కత్తితో పలుమార్లు పొడిచి చంపారు. అనంతరం వారిద్దరూ ఏమీ తెలియనట్లుగా ఫ్యాక్టరీకి వెళ్లారు. తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చిన బాలిక.. తన తల్లిని ఎవరో హత్య చేశారని చుట్టుపక్కల వాళ్ళను నమ్మించింది. సమాచారమందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే బాలిక చెబుతున్న విషయాలు కొంత అనుమానం కలిగించడంతో.. బాలికను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. విచారణలో బాలిక జరిగినదంతా చెప్పింది. దాంతో పోలీసులు బాలిక ప్రియుడిని అరెస్టు చేశారు. బాలికను, ఆమె ప్రియుడిని కోర్టులో ప్రవేశపెట్టగా.. యువకుడికి మార్చి 27 వరకు రిమాండ్ విధించగా.. బాలిక మైనర్ కావడంతో జువైనల్ హోంకు తరలించారు.