- 18 మందికి తీవ్ర గాయాలు
- మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో ఘోరం
- ప్యాకింగ్ యూనిట్లో 35 మంది పనిచేస్తుండగా బ్లాస్ట్
నాగ్పూర్: మహారాష్ట్ర నాగ్పూర్ జిల్లాలోని గన్ పౌడర్ తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో 17 మంది కార్మికులు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కటోల్ తాలూకా రౌల్గావ్ గ్రామంలో ఉన్న ఎస్బీఎల్ ఎనర్టీ లిమిటెడ్ కంపెనీలో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలియగానే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సిబ్బంది ఫైర్ ఇంజన్లతో స్పాట్కు చేరుకుని మంటలు అదుపు చేశారు.
రక్షణ చర్యలు చేపట్టి శిథిలాల కింద చిక్కుకున్న 18 మందిని గుర్తించి నాగ్పూర్లోని ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి కండిషన్ సీరియస్గా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చన్నారు.
నాగ్పూర్లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేసి సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నారు. అయితే, డిటోనేటర్ల ప్యాకింగ్ యూనిట్లో ఉదయం 7.15 గంటల ప్రాంతంలో పేలుడు జరిగిందని కంపెనీ అధికారులు మీడియాకు తెలిపారు. ఫ్యాక్టరీలో కార్మికులంతా మైనింగ్, ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజివ్స్, కార్ట్రిడ్జ్లు వంటి పేలుడు పదార్థాల తయారీ, ప్యాకింగ్ పనుల్లో ఉండగా ఉన్నట్టుండి బ్లాస్ట్ అయిందని పేర్కొన్నారు. ఆ సమయంలో ఇద్దరు సూపర్వైజర్ల పర్యవేక్షణలో 35 మందిదాకా పనిచేస్తున్నారని వివరించారు. పేలుడు ధాటికి యూనిట్ పూర్తిగా ధ్వంసమైందన్నారు. ప్రమాదానికి కారణాలేంటో అన్వేషిస్తున్నామని చెప్పారు.
ప్రధాని మోదీ, సీఎం ఫడ్నవీస్ దిగ్ర్భ్రాంతి
బ్లాస్టింగ్ వార్త తెలిసి ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్ర్భ్రాంతి వ్యక్తం చేశారు. 17 మంది చనిపోవడం అత్యంత విషాదకరమని మోదీ పేర్కొన్నారు. పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయాలైనవాళ్లకు రూ.50 వేల చొప్పును ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
ఇది అత్యంత దురదృష్టకర ఘటన అని సీఎం ఫడ్నవీస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర సర్కారు తరఫున రూ.5 లక్షల చొప్పున అందజేస్తామని తెలిపారు. పేలుడు కారణాలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని అధికారులను ఆదేశించారు.
