న్యూఢిల్లీ: జీఎస్టీ వసూళ్లు ఈ ఏడాది అక్టోబర్లో రూ. 1.72 లక్షల కోట్లకు పెరిగాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఈ ఏడాది ఏప్రిల్లో రూ.1.87 లక్షల కోట్లు వసూలు కాగా, ఆ తర్వాత అత్యధికంగా కిందటి నెలలోనే వచ్చాయి. కిందటి నెలలో ప్రభుత్వానికి రూ.1,72,003 కోట్ల గ్రాస్ జీఎస్టీ రెవెన్యూ వచ్చింది. ఇందులో రూ.30,062 కోట్లు సెంట్రల్ జీఎస్టీ నుంచి, రూ.38,171 కోట్లు స్టేట్ జీఎస్టీ నుంచి, రూ. 91,315 కోట్లు ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ నుంచి (ఇందులో దిగుమతులపై వసూలు చేసిన రూ.42,127 కోట్లు కలిసి ఉన్నాయి) వచ్చాయి.
సెస్ కింద రూ.12,456 కోట్లు వసూలయ్యాయని, ఇందులో దిగుమతుల నుంచి వసూలయిన రూ. 1,294 కోట్లు కలిసి ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. ఐజీఎస్టీ కలెక్షన్స్లో సీజీఎస్టీ కింద రూ.42,873 కోట్లను, ఎస్జీఎస్టీ కింద రూ.36,614 కోట్లను ప్రభుత్వం సెటిల్ చేసింది. కిందటేడాది అక్టోబర్లో వచ్చిన జీఎస్టీ రెవెన్యూతో పోలిస్తే కిందటి నెలలో 13 శాతం ఎక్కువ జీఎస్టీ వసూళ్లయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెలకు సగటున రూ.1.66 లక్షల కోట్ల జీఎస్టీ రెవెన్యూ వచ్చింది.
తెలంగాణకు రూ.23,478 కోట్లు
ఈ ఏడాదిలో ఏప్రిల్ – అక్టోబర్ మధ్య తెలంగాణ రాష్ట్రానికి రూ. 23,478 కోట్ల జీఎస్టీ రెవెన్యూ వచ్చింది. కిందటి ఆర్థిక సంవత్సరంలోని ఇదే టైమ్లో వచ్చిన రూ.21,301 కోట్లతో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ. ఆంధ్రప్రదేశ్కు ఇదే టైమ్లో రూ.18,488 కోట్ల జీఎస్టీ వచ్చింది.