239 మంది రౌడీషీటర్లకు డ్రగ్స్ టెస్ట్.. 189 మందికి పాజిటివ్

239 మంది రౌడీషీటర్లకు డ్రగ్స్ టెస్ట్.. 189 మందికి పాజిటివ్
  • అందరూ గంజాయి 
  • తీసుకున్నట్టుగా నిర్ధారణ
  • ఎక్కడి నుంచి తెస్తున్నారని పోలీసుల ఆరా 
  • కేసులు నమోదు.. డాక్టర్లతో కౌన్సెలింగ్

 బషీర్​బాగ్, వెలుగు:  ఇప్పటికే డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్న హైదరాబాద్ పోలీసులు తాజాగా ఒక వినూత్న ప్రయోగం చేశారు. ఎవరైనా రౌడీషీటర్లు డ్రగ్స్​వాడుతున్నారా? అన్నది తెలుసుకోవడానికి ఏకంగా వందల మందిని నగరంలోని మూడు ప్రధాన హాస్పిటల్స్​కు తరలించి శుక్రవారం డ్రగ్స్​టెస్టులు చేయించారు. దీంతో వీరిలో ఏకంగా 79 శాతం మంది డ్రగ్స్​వాడుతున్నట్టు తేలింది. అది కూడా ఎక్కువ శాతం గంజాయి ఉన్నట్టు గుర్తించారు. దీంతో వారు ఎక్కడి నుంచి డ్రగ్స్​తీసుకువస్తున్నారు?  ఎప్పటి నుంచి వాడుతున్నారు?  దందా కూడా చేస్తున్నారా? అన్న విషయాలు తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. గంజాయి వాడుతున్నందుకు వారిపై కేసులు కూడా నమోదు చేశారు. అక్కడే అందరికీ కౌన్సిలింగ్ కూడా ఇప్పించారు. 

టాస్క్​ఫోర్స్, హెచ్​న్యూ ఆధ్వర్యంలో..

హైదరాబాద్ టాస్క్ ఫోర్స్, నార్కోటిక్స్ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ వింగ్ (హెచ్-న్యూ) సంయుక్తంగా స్థానిక పోలీసుల సమన్వయంతో రౌడీ షీటర్లు, గొడవలకు దిగే వ్యక్తులు, గతంలో ఎన్‌‌డీపీఎస్ కేసుల్లో పట్టుబడిన డ్రగ్స్​వాడకందారులకు ఆకస్మిక డ్రగ్ టెస్టులు నిర్వహించారు. స్పెషల్​టీమ్స్​ఏర్పాటు చేసి ఉస్మానియా, గాంధీ, ఎర్రగడ్డ ఆస్పత్రిలో 239 మందికి డ్రగ్స్​కిట్స్​తో టెస్టులు జరిపారు. గాంధీ హాస్పిటల్‌‌లో 70 మందికి పరీక్షలు చేయగా, 44 మందికి పాజిటివ్ వచ్చింది. ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌‌లో 80 మందికి టెస్ట్​చేయగా, 59 మందికి పాజిటివ్ గా తేలింది. ఎర్రగడ్డలో 89 మందికి పరీక్షలు నిర్వహించగా ఏకంగా 86 మందికి పాజిటివ్ వచ్చింది. మొత్తంగా 239 మందికి పరీక్షలు చేయగా, 189 మంది డ్రగ్స్​తీసుకున్నట్టు గుర్తించారు. అందరూ గంజాయి తీసుకున్నట్టు నిర్ధారణ అయిందని.. కొకైన్, ఎండీఎంఏ లాంటి డ్రగ్స్​వాడినట్టు మాత్రం తేలలేదని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. 

అక్కడికక్కడే కౌన్సిలింగ్​

డ్రగ్స్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన వారికి డాక్టర్లు కౌన్సిలింగ్​ఇచ్చారు. అలాగే, వారిపై కేసులు నమోదు చేయనున్నట్లు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్, హెచ్-న్యూ డీసీపీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ తెలిపారు. ఎక్కువగా అడిక్ట్​అయిన వారిని రిహాబిలిటేషన్ సెంటర్​కు తరలించనున్నట్టు చెప్పారు. అక్కడ వారికి 15 రోజులపాటు ప్రత్యేక పునరావాస కార్యక్రమాలు, బిహేవియరల్ కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఈ స్పెషల్ ఆపరేషన్ లో చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ అడిషనల్​డీసీపీ అందె శ్రీనివాస్, రాజేంద్రనగర్ జోన్ టాస్క్ ఫోర్స్ అడిషనల్​డీసీపీ ఇక్బాల్ సిద్ధిఖీ పాల్గొన్నారు.