
హైదరాబాద్: కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో నవ వధువు పూజిత (19) ఆత్మహత్య చేసుకున్న ఘటన పైన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా భర్త శీనును అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే పూజిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయిందని కూకట్ పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి వెల్లడించారు. పూజితకు శీనుతో వివాహం జరిగి రెండున్నర నెలలు అవుతుందని తెలిపారు. కేపీహెచ్బీ ఈడబ్ల్యూఎస్లోని ఫ్లాట్ నంబర్ 1140లో పూజిత, ఆమె భర్త శీను నివాసం ఉంటున్నారు.
శనివారం 9 గంటల సమయంలో పూజిత ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అదనపు కట్నం కోసం భర్త వేధిస్తుండడం.. పెళ్లి సమయంలో 11 లక్షల రూపాయల కట్నం ఇవ్వడంతో పాటు అదనంగా మరొక పది లక్షలు కావాలంటూ భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని ఏసీపీ వెల్లడించారు. ఇప్పటికే మృతురాలి నానమ్మ భద్రమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ సెక్షన్ 80 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
ఖమ్మం జిల్లా కొణిజెర్లకు చెందిన మాలోతు పూజిత(19)కు శ్రీనుతో గత ఏప్రిల్లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.11 లక్షల విలువైన బంగారం, ఇంటి సామగ్రి కట్నంగా ఇచ్చారు. కొత్త దంపతులు కేపీహెచ్బీ కాలనీ టెంపుల్ బస్టాప్సమీపంలో ఉంటున్నారు. అయితే పెళ్లయిన కొన్ని రోజుల నుంచే పూజితను ఆమె భర్తతోపాటు అత్తామామ, మరదలు, బావ, అతని భార్య అదనంగా రూ.10 లక్షలు కట్నం తీసుకురావాలని వేధిస్తున్నారు. కొంత సమయం ఇస్తే ఇస్తామని పూజిత కుటుంబసభ్యులు ఒప్పుకున్నారు.
అయినా వేధింపులు ఆగకపోవడంతో శనివారం రాత్రి ఆమె ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. శ్రీను పూజిత తల్లికి ఫోన్చేసి, ఉరేసుకున్నట్లు చెప్పాడు. మృతురాలి కుటుంసభ్యులు ఆదివారం కేపీహెచ్బీ పోలీస్స్టేషన్కు వెళ్లి, అత్తింటి వేధింపులతోనే పూజిత సూసైడ్చేసుకుందని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు పూజిత భర్త శ్రీనును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.