
58 ఏళ్ల క్రితం రెండు గేదెలు, ఒక దూడను దొంగిలించిన కేసులో 78 ఏళ్ల వృద్ధుడిని అరెస్టు చేసినట్లు బీదర్ పోలీసులు తెలిపారు. నిందితుడిని గణపతి వాఘ్మోరేగా గుర్తించారు పోలీసులు. 1965లో మహారాష్ట్రలోని బుల్ధాన్ జిల్లాలోని మెహకర్ పోలీస్ స్టేషన్లో మురళీధర్ రావు కులకర్ణికి చెందిన రెండు గేదెలు, ఒక దూడ చోరీకి గురయ్యాయి. ఈ క్రమంలో అతని ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
ఈ ఘటన తర్వాత మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతంలోని ఉదగిర్కు చెందిన 30 ఏళ్ల కిషన్ చందర్, 20 ఏళ్ల గణపతి వాఘ్మోర్లను అరెస్టు చేశారు. అనంతరం బెయిల్ పొందిన ఈ నిందితులు పరారీలో ఉన్నారు, వారెంట్ జారీ చేసిన తర్వాత కూడా వారు కోర్టుకు హాజరు కాలేదు. ఈ కేసులో మొదటి నిందితుడు కిషన్ మృతి చెందడంతో అతడిపై కేసు కొట్టివేశారు. మరో నిందితుడు గణపతి చాలా ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నాడు. ఈ క్రమంలో గణపతిని గుర్తించిన ప్రత్యేక బృందం.. ఇటీవలే కోర్టులో హాజరుపరిచింది. దొంగతనం జరిగినప్పుడు గణపతి వయసు కేవలం 20 ఏళ్లు. ఆయనకు ఇప్పుడు 78 ఏళ్లు.
‘‘ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కేసులు, నిందితులు కోర్టుకు హాజరుకాని ఎల్పీఆర్ కేసుల కోసం అధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం 58 ఏళ్ల నాటి కేసులో నిందితుడిని అరెస్టు చేసి, మొత్తం ఏడుగురిని కనుగొనడంలో విజయం సాధించింది'' అని బీదర్ పోలీసులు తెలిపారు.