కుప్పకూలిన ఇల్లు.. ఇద్ద‌రు చిన్నారుల‌తో స‌హ తం‌డ్రి మృతి

కుప్పకూలిన ఇల్లు.. ఇద్ద‌రు చిన్నారుల‌తో స‌హ తం‌డ్రి మృతి

ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని చైసర్‌ గ్రామంలో ఓ ఇల్లు కుప్పకూలిన‌ ఘటనలో కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా… మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. శుక్ర‌వారం తెల్ల‌వారుజా‌మున ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో కుటుంబ యజమానితో పాటుగా అత‌ని ఇద్దరు పిల్లలు శిథిలాల కింద ప‌డి చ‌నిపోయారు. మృతుడి భార్య తీవ్ర గాయాలపాలైంది.

సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుడి భార్యను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, ఇల్లు కుప్పకూలడానికి గల కారణాలు తెలియరాలేదని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. వర్షాల కారణంతో పాటుగా ఆ ఇల్లు కూడా పాత‌ది అవ‌టం వ‌ల్ల కూలిపోయి ఉంటుందని అధికారులు అంటున్నారు.