పాట్నా: బీహార్లోని ఓ ప్రైమరి హెల్త్సెంటర్ లో రూ.500 కోసం ఇద్దరు హెల్త్వర్కర్లు జుట్లు పట్టుకొని చెప్పులతో కొట్టుకున్నారు. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. బీహార్లోని జముయి జిల్లా లక్ష్మీపూర్ బ్లాక్లోని ప్రైమరీ హెల్త్సెంటర్లో ఆదివారం.. రింటూ కుమారి అనే ఆశా వర్కర్ ఓ పాపకు బీసీజీ టీకా వేయించేందుకు రంజన కుమారి అనే ఏఎన్ఎం దగ్గరకు తీసుకువెళ్లింది.
టీకా వేసేందుకు ఏఎన్ఎం రూ.500 డిమాండ్ చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. అదికాస్తా పెరిగి, జుట్లు పట్టుకొని కొట్టుకునేదాకా పోయింది. పిల్లలకు వ్యాక్సిన్ వేయించేందుకు వచ్చిన వాళ్లు అడ్డుకునేందుకు ప్రయత్నించినా వారు వినలే. చివరకు చెప్పులతో కొట్టుకునే ప్రయత్నం చేయడంతో ఓ వ్యక్తి బలవంతంగా ఆపాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. కాగా, ఇద్దరిలో ఇప్పటి వరకు ఆఫీసర్లు ఎవరినీ సస్పెండ్ చేయలేదు.