
- లైసెన్స్ సర్వేయర్లకు శిక్షణ షురూ
- మహబూబ్నగర్, నారాయణపేటలోని 28 మండలాలకు రెగ్యులర్ సర్వేయర్లు 20 మందే
మహబూబ్నగర్, వెలుగు: గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ వివాదాలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో ‘భూభారతి’ చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రతి రైతుకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు సన్నద్ధం అవుతోంది. ఇందులో భాగంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కీలకంగా ఉండే సర్వేయర్లను భూభారతి చట్టంలో భాగం చేయనుంది. జిల్లాల్లో సరిపడా సర్వేయర్లు లేకపోవడంతో.. కొత్తగా లైసెన్స్ సర్వేయర్లను తీసుకోనుంది. ఇప్పటికే ఆసక్తి ఉన్న వారి నుంచి అప్లికేషన్లు తీసుకోగా, వాటి పరిశీలన పూర్తి చేసింది. ఎంపిక చేసిన క్యాండిడేట్లకు ట్రైనింగ్ క్లాసులు ప్రారంభం కాగా.. 50 రోజుల పాటు ఈ ట్రైనింగ్ కొనసాగునుంది. ట్రైనింగ్ తర్వాత ప్రభుత్వం నిర్వహించే ఎగ్జామ్ లో పాస్ అయిన వారికే లైసెన్స్ సర్వేయర్సర్టిఫికెట్లు ఇవ్వనున్నారు. అనంతరం వారు భూభారతి సర్వేలో పాల్గొంటారు.
ఫస్ట్ బ్యాచ్కు శిక్షణ ప్రారంభం..
మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో లైసెన్స్ సర్వేయర్ల మొదటి బ్యాచ్ ఎంపిక పూర్తయింది. ఇందులో మహబూబ్నగర్ జిల్లా నుంచి 132 మంది, నారాయణపేట జిల్లా నుంచి 109 మంది ఎంపికయ్యారు. వీరికి రెండు రోజుల నుంచి ట్రైనింగ్ కొనసాగుతోంది. మహబూబ్నగర్లో రిటైర్డ్ రెవెన్యూ ల్యాండ్ ఇన్స్పెక్టర్ పర్వతాలు, రిటైర్డ్ సర్వేయర్లు కొండన్న, బషీర్, నాగభూషణం శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ సందర్భంగా వీరికి ప్రభుత్వం హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా మెటీరియల్ తెప్పించింది.
సర్వేకు సంబంధించిన నోట్స్, రెండు ప్లాటింగ్ బుక్స్, థియరీ బుక్, పెన్సిళ్లు, కంపాక్స్ బాక్స్ సెట్ ఉన్నాయి. శిక్షణలో భాగంగా భూమిని ఎలా కొలవాలి? సర్వే నంబర్లు అంటే ఏంటి? దాని లెక్కలు ఎలా తీయాలి? తదితర అంశాలను వివరిస్తున్నారు. క్యాండిడేట్లను ఫీల్డ్కు తీసుకెళ్లి భూమిని ఎలా కొలవాలనే విషయంపై ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు. ఈ శిక్షణ తర్వాత క్యాండిడేట్లకు ఎగ్జామ్ నిర్వహించి, పాస్ అయిన వారినే లైసెన్స్ సర్వేయర్లుగా నియమించనున్నారు.
భూభారతిలో సర్వేయర్ల పాత్ర కీలకం..
గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చట్టం ద్వారా రైతులకు భూ సమస్యలు ఎక్కువయ్యాయి. ఇదే క్రమంలో భూ వివాదాలు కూడా ఎక్కువయ్యాయి. చాలా చోట్ల భూ వివాదాల వల్ల దాడులు, ప్రతి దాడులు జరిగిన ఘటనలు ఉన్నాయి. ఈ పోర్టల్ అమలులోకి వచ్చాక ఒకరి పేరు మీద ఉన్న భూమి మరొకరి పేరు మీద పడడం, సర్వే నంబర్లు తప్పుగా పడడం, విరాసత్లు కాకపోవడం, హద్దులు తప్పుగా పడడం, డిజిటల్ సిగ్నేచర్, ఈకేవైసీలు పెండింగ్లో ఉండడంతో రైతులకు సమస్యలు ఎదురయ్యాయి. దీనికితోడు గతంలో ఒకరి పొలాన్ని మరొకరికి విక్రయించినా.. పాత పట్టాదారు పేరు పోర్టల్లో సమస్యలు ఏర్పడ్డాయి. పట్టా పాసు పుస్తకాల్లో కూడా పేర్లు, ఇంటి పేర్లు, ఆధార్ నంబర్లు, తండ్రి పేర్లు, సర్వే నంబర్లు, హద్దులు, భూ విస్తీర్ణంలో తేడాలు వచ్చాయి.
ఈ కారణాలతో చాలా మంది రైతులు ఇప్పటికే రైతు భరోసా, ఇతర వ్యవసాయ సబ్సిడీలు, స్కీములకు నోచుకోలేకపోతున్నారు. భూభారతి ద్వారా సర్వేయర్లు ఫీల్డ్ విజిట్కు వెళ్లి భూ సర్వే చేయాల్సి ఉంటుంది. మండలాల్లో సరిపడా సర్వేయర్లు లేకపోవడంతో కొత్తగా లైసెన్స్ సర్వేయర్లను తీసుకుంటోంది. వీరు సెలెక్ట్ అయ్యాక గ్రామాల్లో రైతులు అప్లై చేసుకున్న భూములను సర్వే చేయాల్సి ఉంటుంది. ఆ రిపోర్టును రెగ్యులర్ సర్వేయర్కు అందించిన తరువాత, వారు ఫైనల్గా ఆ ల్యాండ్కు సంబంధించిన మ్యాప్ రూపొందించి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. అలాగే ప్రభుత్వ భూములను కూడా సర్వే చేసి.. వాటి వివరాలను కూడా ఆన్లైన్లో నమోదు చేసి భూముల రక్షణకు చర్యలు తీసుకోనున్నారు.
సర్వేయర్ల కొరత..
ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాలో 15 మండలాలకు సర్వేయర్లు ఉన్నారు. అయితే ఏదైనా సమస్యతో రైతులు భూ సర్వేల కోసం ఆన్లైన్ చలాన్ తీసి రెవెన్యూ ఆఫీసులో అప్లై చేసుకుంటున్నా.. సర్వే చేయడం ఆలస్యం అవుతోంది. చలాన్ కట్టిన రోజే ఫలానా తేదీన సర్వే ఉంటుందని ఆఫీసుల్లో డేట్ ఇచ్చినా.. ఆ టైంకు సర్వేయర్లు గ్రామాలకు రావడం లేదని అంటున్నారు. ముఖ్యమైన మండలాల్లో పని భారంతో టైమ్కు సర్వేలు జరగడం లేదని చెబుతున్నారు. దీనికితోడు కొందరు సర్వేయర్లకు ప్రాజెక్టులు, ఇతర కేంద్ర పథకాలకు సంబంధించిన భూ సర్వే బాధ్యతలు అప్పగించడంతో రైతులకు సంబంధించినసర్వేలు ఆలస్యం
అవుతున్నాయి.