
ఖమ్మం/మధిర, వెలుగు: రాష్ట్రంలోని అన్ని విద్యుత్ ప్రాజెక్ట్లను కాంగ్రెస్ హయాంలోనే పూర్తి చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. పదేండ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ కొత్తగా ఒక్క యూనిట్ను కూడా ఉత్పత్తి చేయలేదన్నారు. బీఆర్ఎస్కు అసలు ఎనర్జీ పాలసీనే లేదన్నారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి బుధవారం ఆయన ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా 1912 విద్యుత్ అంబులెన్స్ను, బోనకల్ మండలం జానకీపురం సబ్స్టేషన్లో రియల్ టైం ఫీడర్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఫాల్ట్ పాసేజ్ ఇండికేటర్స్ను ప్రారంభించి, మధిరలో రూ.10 కోట్లతో కొత్త బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లోని మొదటి దశ నుంచి ఏడో దశ వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే చేపట్టి పూర్తి చేశామని గుర్తు చేశారు.
తాము తిరిగి అధికారంలోకి వచ్చాకే కొత్త విద్యుత్ పాలసీ తీసుకొచ్చామన్నారు. 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎక్కడైనా విద్యుత్ సమస్యలు ఏర్పడితే 1912 నంబర్కు ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చి రిపేర్లు పూర్తి చేస్తుందన్నారు. రైతుల కోసం ప్రతి సంవత్సరం రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఐదేళ్లలో మూడున్నర లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు.
వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులు జమ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం మొక్కలు నాటి తర్వాత పట్టించుకోకుండా.. రూ. 30 వేల కోట్ల మట్టి పాలు చేశారని ఆరోపించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనందున గురుకులాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆఫీసర్లను ఆదేశించారు.
గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్లు పంపిణీ చేయాలని, వన మహోత్సవంలో భాగంగా తాటి, ఈత ఖర్జూర మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, హస్త కళా చైర్మన్ నాయుడు సత్యనారాయణ పాల్గొన్నారు.