న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జనాభా లెక్కింపు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి 2027 ఫిబ్రవరి మధ్య 2 విడతల్లో నిర్వహిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య మొదటి దశలో, 2026 సెప్టెంబర్ నుంచి రెండో దశలో చేపడతామని చెప్పింది. ఎంపీ రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానంద్రాయ్ జవాబిచ్చారు.
కేబినెట్ కమిటీ నిర్ణయించినట్లుగా కులాలవారీగా జనాభా లెక్కింపు జరుగుతుందన్నారు. 150 ఏండ్లకు పైగా చరిత్ర ఉన్న జనాభా గణనలో గత అనుభవాలను పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. లడఖ్, హిమాచల్, ఉత్తరాఖండ్లో జనాభా లెక్కింపు సెప్టెంబర్ 2026లోనే ఉంటుందని వెల్లడించారు.
