జార్ఖండ్లో 24 మంది మావోయిస్టులు సరెండర్

జార్ఖండ్లో 24 మంది మావోయిస్టులు సరెండర్

భద్రాచలం, వెలుగు: జార్ఖండ్ ​రాజధాని రాంచీలో మంగళవారం డీజీపీ తదాషామిశ్రా సమక్షంలో 24 మంది మావోయిస్టులు సరెండర్​ అయ్యారు. ఆపరేషన్​ నవజీవన్​ పేరిట జార్ఖండ్​ ప్రభుత్వం నక్సల్స్  ఆపరేషన్  చేపట్టింది. సరెండర్​ అయిన మావోయిస్టుల్లో 8 మంది ఛత్తీస్​గఢ్​ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు.

జార్ఖండ్​ మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు రీజనల్​ కమిటీ మెంబర్​ సంతోష్​ అలియాస్​ బాసుదేవ్​ అలియాస్​ గాంధీపై రూ.15లక్షల రివార్డు, జోనల్ కమిటీ సభ్యుడు చందన్​ లోహాపై రూ.10 లక్షల రివార్డు, సబ్​ జోనల్​ కమిటీ సభ్యులు అనిల్​ తురీ, సుఖ్​లాల్బిరింజియాపై రూ.5లక్షల రివార్డు, ఏరియా కమిటీ సభ్యులు సుదేశ్​హోన్​హోగా, రిసివ్​ బుధ్​ సోయాపై రూ.2లక్షల రివార్డు ఉంది.

ఛత్తీస్​గఢ్​ రాష్ట్రానికి చెందిన 8 మంది మావోయిస్టుల్లో జోనల్ కమిటీ సభ్యుడు అశ్విన్, సబ్​ జోనల్​ కమిటీ సభ్యులు పూనెం సోహన్, రాహత్​ మాండవి, ఏరియా కమిటీ సభ్యులు రీతా, అనూషా, రజనీ ఉన్నారు. సరెండర్​ అయిన మావోయిస్టుల నుంచి 6 ఇన్సాస్​ రైఫిల్స్, 2 ఏకె-47లు, ఒక హెచ్​కే -33 రైఫిల్, ఒక యూఎస్​ కార్బన్, 11 ఎం-16 రైఫిల్స్  వంటి అధునాతన ఆయుధాలు, 38 మ్యాగజైన్లు, 1,562 లైవ్​ తూటాలు స్వాధీనం చేసుకున్నారు.

మావోయిస్టుల డంప్​ స్వాధీనం
ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని నారాయణ్​పూర్​ జిల్లాలో మంగళవారం ఐటీబీపీ, డీఆర్జీ, లోకల్​ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్​లో మావోయిస్టులకు చెందిన డంప్  లభ్యమైంది. ఓర్చా పోలీస్​స్టేషన్​ పరిధిలోని ఆడింగ్​పార్​ క్యాంప్​ నుంచి తనిఖీలు చేపట్టారు.

కసోద్​- కుమేరడి మార్గంలో డంప్​ కనిపించింది. 297 లైవ్​ తూటాలు దొరికాయి. 7.62 మిల్లీమీటర్​ సైజ్​ కలిగిన 195 తూటాలు, 102.5 మిల్లీమీటర్​ సైజ్​ ఉన్న 102 తూటాలు ఉన్నాయి. సరెండర్​ అయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు అబూజ్​మాఢ్​ అడవులను భద్రతాబలగాలు జల్లెడ పడుతున్నాయి.