
- ప్రభుత్వానికి 100 బిలియన్ డాలర్ల ఆదాయం
- 1.52 రెట్లు పెరగనున్న ఉద్యోగుల సంఖ్య
- ఐసీఆర్ఏ అంచనా
న్యూఢిల్లీ: రాబోయే ఐదేళ్లలో భారతదేశంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ (జీసీసీలు) సంఖ్య 2,500కు పైగా పెరుగుతుందని రేటింగ్ సంస్థ ఐసీఆర్ఏ అంచనా వేసింది. ప్రస్తుతం దేశంలో సుమారు 1,700 జీసీసీలు ఉన్నాయి. 2024–-25 ఆర్థిక సంవత్సరంలో, జీసీసీలు టాప్–6 నగరాలలో రికార్డు స్థాయిలో 24 మిలియన్ చదరపు అడుగుల గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ను లీజుకు తీసుకున్నాయి.
మొత్తం లీజింగ్లో వీటి వాటా 2023 ఆర్థిక సంవత్సరంలో 27 శాతం నుంచి 37 శాతానికి పెరిగింది. 2026, 2027 ఆర్థిక సంవత్సరాలలో జీసీసీలు 50-55 మిలియన్ చదరపు అడుగుల గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ను లీజుకు తీసుకుంటాయని ఐసీఆర్ఏ అంచనా వేసింది. ఇది బెంగళూరు, చెన్నై, ఢిల్లీ , హైదరాబాద్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, పుణెలలో మొత్తం ఆఫీస్ స్పేస్ డిమాండ్లో 38-–40 శాతం వాటాకు సమానం. 2030 నాటికి జీసీసీల సంఖ్య 1,700 నుంచి 2,500కు పెరగడం ద్వారా ప్రభుత్వాలకు 100 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం వస్తుంది.
ఉద్యోగుల సంఖ్య 1.5-2 రెట్లు పెరగనుంది. తక్కువ ఖర్చులు, తగినంత ట్యాలెంట్ అందుబాటులో ఉండటం, ప్రభుత్వాల నుంచి మద్దతు వల్ల గ్లోబల్ కంపెనీలు మనదేశంలో జీసీసీలను ఏర్పాటు చేస్తున్నాయని ఐసీఆర్ఏ కార్పొరేట్ రేటింగ్స్ వైస్– ప్రెసిడెంట్ అనుపమా రెడ్డి అన్నారు.