అప్పుడూ.. ఇప్పుడూ అదే అడ్డా!...వివాదాలకు కేరాఫ్‌‌‌‌ గా పైలెట్ రోహిత్‌‌‌‌ రెడ్డి ఫాంహౌస్

అప్పుడూ.. ఇప్పుడూ అదే అడ్డా!...వివాదాలకు కేరాఫ్‌‌‌‌ గా పైలెట్ రోహిత్‌‌‌‌ రెడ్డి ఫాంహౌస్
  •     2022లో నలుగురు బీఆర్ఎస్​ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో వార్తల్లోకి
  •     నాడు బీజేపీతో వంద కోట్ల డీల్‌‌‌‌పై రహస్య మంతనాలు
  •     వీడియోలు బయటకు రావడంతో రాష్ట్రంలో సంచలనం
  •     ఇప్పుడు అదే ఫాంహౌస్‌‌‌‌లో డ్రగ్స్‌‌‌‌తో దొరికిపోయిన రోహిత్‌‌‌‌రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ మాజీ ఎమ్మెల్యే పైలెట్​ రోహిత్‌‌‌‌ రెడ్డికి చెందిన మొయినాబాద్​ ఫాంహౌస్​ హాట్​ టాపిక్​గా మారింది. డ్రగ్స్​ తీసుకుంటూ రోహిత్‌‌‌‌రెడ్డి ఈగల్​ టీమ్‌‌‌‌కు  అడ్డంగా దొరికిపోవడంతో మరోసారి వార్తల్లో నిలిచింది.  ఇదే ఫాంహౌస్‌‌‌‌లోనే.. సరిగ్గా మూడున్నరేండ్ల క్రితం ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారమూ బయటపడింది. మునుగోడు బై ఎలక్షన్స్‌‌‌‌కు ముందు 2022 అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఆ ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనమే సృష్టించింది. 

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ అధిష్టానం ప్రయత్నాలు చేసిందన్న ఆరోపణలు రాష్ట్రమంతటా గుప్పుమన్నాయి. ఈ వ్యవహారమంతా కేంద్రంలో కీలకంగా ఉన్న బీఎల్​ సంతోష్​ కనుసన్నల్లోనే జరిగిందన్న చర్చోపచర్చలూ జరిగాయి. అప్పట్లో బీఆర్ఎస్​ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన పైలెట్​ రోహిత్‌‌‌‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌‌‌‌రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజును బీజేపీలో చేర్చుకునేందుకు వంద కోట్ల డీల్‌‌‌‌.. రోహిత్‌‌‌‌రెడ్డి ఫాంహౌస్​లోనే జరిగినట్టు రహస్య మంతనాల వీడియోలు బయటకు లీకయ్యాయి. 

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ అధిష్టానమే ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాప్​ చేసి.. కొనుగోళ్ల వ్యవహారం తెలుసుకుని ఆ ఎమ్మెల్యేలతోనే రహస్యంగా వీడియోలు తీయించి బయటకు లీక్​ చేశారనే చర్చ కూడా జోరుగా సాగింది. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ పార్టీ అదే అస్త్రాన్ని వాడుకున్నది. బీజేపీ ప్రభుత్వం వంద కోట్లకు ప్రలోభపెట్టినా.. తమ ఎమ్మెల్యేలు అమ్ముడుపోలేదంటూ ప్రచారంలో ఆ పార్టీ నేతలు ఊదరగొట్టారు. ఆ ఎమ్మెల్యేలను కేసీఆర్​ తన ప్రచార సభల్లో ప్రజలకు చూపించి మరీ ఉపన్యాసాలు ఇచ్చారు. ఆ ఎఫెక్ట్​తోనే మునుగోడు ఎన్నికల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ గట్టెక్కిందని, లేదంటే ఆ ఎన్నికల్లోనూ ఓడిపోయి ఉండేదన్న చర్చ పొలిటికల్​ సర్కిల్స్‌‌‌‌లో జోరుగానే నడిచింది.

ఇప్పుడూ అదేచోట..

తాజాగా శనివారం రాత్రి అదే పైలెట్​ రోహిత్‌‌‌‌రెడ్డి ఫాంహౌస్​లో డ్రగ్స్​ తీసుకుంటూ పలువురు అడ్డంగా దొరికిపోయారు. ఇందులో టీడీపీకి చెందిన ఏపీ ఎంపీ పుట్టా మహేశ్​ యాదవ్​ కూడా ఉన్నారు. అందరికీ డ్రగ్స్​ టెస్ట్​ పాజిటివ్​ వచ్చింది.   ఓ మాజీ ఎమ్మెల్యే డ్రగ్స్​ తీసుకుని దొరికిపోవడం, ఆ ఫాంహౌస్​ కూడా వివాదాలకు కేరాఫ్​గా ఉండడంతో..ఈ వ్యవహారం మొత్తం ప్రస్తుతం బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు పొగపెట్టినట్టయింది. 

ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితం కావడం, పార్లమెంట్‌‌‌‌లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుని డీలా పడిన ఆ పార్టీకి.. కవిత రూపంలో  ముప్పు ముంచుకొస్తున్నది.  ఆమె బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ పార్టీని టార్గెట్‌‌‌‌గా చేసుకుంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇవన్నీ చాలదన్నట్టు మళ్లీ డ్రగ్స్​ వ్యవహారంలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​కు చెందిన ఓ కీలక నేతే దొరకడంతో.. ఆ ఉచ్చు కూడా బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ మెడకు చుట్టుకుంటున్నదన్న చర్చ నడుస్తున్నది.  

పొలిటికల్​ సర్కిల్స్‌‌‌‌లో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు డ్రగ్స్​తో సంబంధం ఉందన్న మాట వాస్తవమంటూ పలువురు కీలక నాయకులే ఆరోపణలు చేస్తున్నారు. గతంలో వచ్చిన ఆరోపణల నుంచే బయటపడేందుకు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రయత్నిస్తుండగా.. ఇప్పుడు మరింత డ్యామేజ్​ చేసేలా ఈ వ్యవహారం జరిగింది. అయితే, ఎంతటి వారినైనా ఉపేక్షించవద్దని, డ్రగ్స్‌‌‌‌కు తాము వ్యతిరేకమని కేటీఆర్​ ప్రకటన చేసినా.. మరి, ఆ డ్రగ్స్​ మరకను చెరిపేసుకునేందుకు రోహిత్‌‌‌‌రెడ్డిపై బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.  ఈ డ్రగ్స్‌‌‌‌ వ్యవహారంపై పార్టీ అధినేత కేసీఆర్‌‌‌‌‌‌‌‌తో ఆ పార్టీ నేతలు చర్చించినట్టు కూడా తెలుస్తున్నది.