
హాలియా, వెలుగు : కృష్ణా నది ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో సాగర్ వద్ద 26 గేట్లను ఎత్తారు. 18 గేట్లను ఐదు ఫీట్లు, 8 గేట్లను 10 ఫీట్ల మేర ఎత్తి 2,62,430 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం నుంచి సాగర్కు 3,12,097 క్యూసెక్కుల వరద వస్తుండగా అంతే మొత్తం కిందికి వదులుతున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు కాగా శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు 589 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. కుడి కాల్వకు 9,633 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 8,280 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తికి 29,354, ఎస్ఎల్బీసీకి 1,800, వరద కాల్వకు 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.