పెరిగిన గిడ్డంగుల వాడకం

పెరిగిన గిడ్డంగుల వాడకం

హైదరాబాద్, వెలుగు:  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెళ్లలో  హైదరాబాద్‌‌‌‌లో వేర్‌‌‌‌హౌసింగ్ (గిడ్డంగులు) లావాదేవీలు బాగా పెరిగాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన “ఇండియా వేర్‌‌‌‌హౌసింగ్  మార్కెట్ రిపోర్ట్” ప్రకారం,  ఈ ఏడాది మార్చి–సెప్టెంబరు​ మధ్య నగరంలో మొత్తం 2.71 మిలియన్ చదరపు అడుగుల గిడ్డంగుల లావాదేవీలు జరిగాయి.  దేశంలోని ఎనిమిది కీలక మార్కెట్లలో జరిగిన మొత్తం వేర్‌‌‌‌హౌసింగ్  లావాదేవీలలో హైదరాబాద్​ వాటా సుమారుగా 12 శాతం ఉంది.

నగరంలో  మొదటి ఆరు నెలల్లో రెంటల్​ మార్కెట్​ 2 శాతం ఆరోగ్యకరమైన వృద్ధిని సాధించింది. అద్దె రేట్లు నెలకు చదరపు అడుగుకి రూ. 20.40 లకు చేరాయి. భారతదేశంలోని ప్రైమరీ ఎనిమిది మార్కెట్లలో ఆర్నెళ్లలో మొత్తం 23 మిలియన్ చదరపు అడుగుల వేర్‌‌‌‌హౌసింగ్ లావాదేవీలు జరిగాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్  మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ మాట్లాడుతూ, గిడ్డంగుల మార్కెట్‌‌‌‌లో థర్డ్​పార్టీ లాజిస్టిక్స్​​ రంగం కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.  గత రెండేళ్లలో తయారీ రంగం కూడా గణనీయమైన వృద్ధిని కనబరుస్తున్నందున, ఆ రంగం నుంచి సైతం డిమాండ్ బాగుందని చెప్పారు.