కొనసాగుతున్న రెండో విడత పరిషత్ పోలింగ్

కొనసాగుతున్న రెండో విడత పరిషత్ పోలింగ్

రాష్ట్రంలో రెండో విడత పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 179 ZPTC, 1,850 MPTC స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. జడ్పీటీసీలకు 805 మంది, ఎంపీటీసీ స్థానాలకు 6వేల 146 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రస్తుతం 10వేల 371 కేంద్రాల్లో పరిషత్ పోలింగ్ జరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు అధికారులు.

ఆదిలాబాద్ జిల్లాలో 5 జెడ్పీటీసీ, 45 ఎంపీటీసీ, నిర్మల్ జిల్లాలో 6 జెడ్పీటీసీ, 53 ఎంపీటీసీ, కుమ్రం భీం జిల్లాలో 4 జెడ్పీటీసీ, 42 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 23 జెడ్పీటీసీలు,  278 ఎంపీటీసీ స్థానాలు, నిజామాబాద్ జిల్లాలో 8 జెడ్పీటీసీ, 75 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక జరగుతోంది. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 25 జెడ్పీటీసీ స్థానాలు, 246 ఎంపీటీసీ, మంచిర్యాల జిల్లాలో 5 జెడ్పీటీసీలు, 34 ఎంపీటీసీ, పెద్దపల్లి జిల్లాలో 6 జెడ్పీటీసీ, 69 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 71 జెడ్పీటీసీ, 805 ఎంపీటీసీ స్థానాలకు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 20 జెడ్పీటీసీ, 240 ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. పోలింగ్ సెంటర్ల దగ్గర ఓటర్లకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు అధికారులు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4గంటల వరకే పోలింగ్ ఉంటుంది. సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామంటున్నారు అధికారులు. ఇక పోలింగ్ సరళిని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తున్నారు కమిషనర్ నాగిరెడ్డి.