- రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో ప్రమాదం
- దళిత బంధు విషయంలో ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్తుండగా ఘటన
ఇబ్రహీంపట్నం, వెలుగు : దళిత బంధు విషయంలో ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో గురువారం ఈ ఘటన జరిగింది. అబ్దుల్లాపూర్మెట్ మండలం బాచారం గ్రామానికి చెందిన 30 మంది దళిత బంధు ఆశావహులు సర్పంచ్ సంతోశ్తో కలిసి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిని కలిసేందుకు డీసీఎంలో ఇబ్రహీంపట్నం బయల్దేరారు.
వీరి వాహనం మంగల్ పల్లి సమీపంలో ఎదురుగా వచ్చిన పాల వ్యాన్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎంలో ఉన్న 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పరామర్శించారు.