వనపర్తి, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో వనపర్తి డిపో రూ.10కోట్ల ఆదాయాన్ని గడించిందని, మొత్తం 32 కొత్త బస్సులు వచ్చాయని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. గురువారం వనపర్తి డిపోనకు వచ్చిన నాలుగు కొత్త బస్సులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో వనపర్తి డిపో ఆదాయం రూ. 4 లక్షల నుంచి రూ.-35 లక్షలకు పెరిగిందని తెలిపారు.
ఇటీవల వచ్చిన 4 కొత్త బస్సులను ప్రారంభించిన ఆయన, ఇప్పటివరకు డిపోకు 15 పల్లె వెలుగు, 11 ఎక్స్ ప్రెస్, 2 డీలక్స్, 4 ఎలక్ట్రిక్ బస్సులు కలిపి మొత్తం 32 కొత్త బస్సులు వచ్చాయని, త్వరలోనే మరో 30 నుంచి 40 బస్సులను తీసుకువచ్చి ప్రతి పల్లెకు ఆర్టీసీ సేవలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ వేసవి దృష్ట్యా రైతులకు, ప్రజలకు విద్యుత్ అంతరాయం కలగకుండా నిరంతరం సరఫరా చేయాలని ఆదేశించారు.
