
- రోడ్లపై 20 వేల టన్నులు ఎత్తిన కార్మికులు
- హుస్సేన్సాగర్లో 4,350 విగ్రహ వ్యర్థాలు బయటకు..
- మరో 8 వేల టన్నులు ఉంటుందని అంచనా
- మరో రెండు రోజులపాటు శానిటేషన్ డ్రైవ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: గణేశ్ నవరాత్రోత్సవాల్లో రోడ్లపై 20 వేల టన్నులు, హుస్సేన్సాగర్లో 12 వేల టన్నుల వినాయక విగ్రహ వ్యర్థాలు బయటపడ్డాయి. రోడ్లపై చెత్తను, ‘సాగర్’లో వ్యర్థాలను జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ సిబ్బంది ఇంకా తొలగిస్తూనే ఉన్నారు. ఉత్సవాలు జరిగిన11 రోజులపాటు గ్రేటర్రోడ్లపై భక్తులు 20 వేల టన్నులకు పైగా చెత్త వేయగా, క్లీన్చేశామని బల్దియా అధికారులు ప్రకటించారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు ఒక్కరోజులోనే 4 వేల టన్నుల చెత్త బయటపడిందన్నారు. ఇండ్ల నుంచి వచ్చిన చెత్త ఏడు వేల టన్నులు దీనికి అదనం.
రోడ్లపై చెత్తను ఎప్పటికప్పుడు ఆయా డంపింగ్ యార్డులకు తరలించేందుకు 700 వాహనాలను వినియోగించామన్నారు. నిమజ్జనం జరిగిన హుస్సేన్సాగర్తీరప్రాంతాల్లో పేపర్ షాట్లను తొలగించేందుకు ప్రైవేటుకు చెందిన ఒక జటాయ్ యంత్రాన్ని వాడామని పేర్కొన్నారు. రోడ్డుపై నుంచి నేరుగా మెషీన్లోపలకు చెత్తను తీసుకోవడమే దీని ప్రత్యేకత. మిగతా ప్రాంతాల్లో పేపర్ షాట్ల తొలగింపునకు శానిటేషన్ కార్మికులు ఇబ్బందులు పడాల్సి వచ్చిందని చెప్పారు.
ప్రతిఏటా నిమజ్జనం చివరి రెండు రోజుల్లోనే ఎక్కువగా చెత్త, వ్యర్థాలు వస్తుండడంతో ఈ ఆదివారం, సోమవారం జీహెచ్ఎంసీ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. సోమవారం సాయంత్రానికి పూర్తిగా వ్యర్థాలను తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు.