పాక్, ఇండియా మ్యాచ్లో అనుకున్నదే జరిగింది. కెప్టెన్లు ఇద్దరూ హ్యాండ్ షేక్ చేసుకోలేదు. పహల్గాం ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి పాక్తో మ్యాచ్ను బాయ్కాట్ చేయాలని దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో ఈ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ కూడా కెప్టెన్లు ఇద్దరి మధ్య కూడా ఎలాంటి కరచాలనం లేకుండానే మొదలైంది. టాస్ టైమ్లో ఇరు జట్ల కెప్టెన్ సూర్యకుమార్, సల్మాన్ ఆగా షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేదు.
చిరకాల ప్రత్యర్థులు తలపడుతున్న ఈ భీకర పోరులో పాకిస్తాన్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియాలో రెండు మార్పులు జరిగాయి. అభిషేక్ శర్మ, కుల్దీప్ యాదవ్కు చోటు దక్కింది. సంజూ శాంసన్, అర్ష్ దీప్ సింగ్కు రెస్ట్ ఇచ్చారు. ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగింది. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్సర్ పటేల్.. ఈ ముగ్గురి స్పిన్పై టీమిండియా గట్టి నమ్మకంతో ఉంది. పేస్ బౌలింగ్లో బుమ్రా, హార్థిక్ పాండ్యా ఉండనే ఉన్నారు. పాకిస్తాన్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు.
టీమిండియాలో అందరి ఫోకస్ అభిషేక్ శర్మ పైనే ఉంది. నమీబియాతో మ్యాచ్కు అనారోగ్యం వల్ల దూరమైన యంగ్ ఓపెనర్ పూర్తి ఫిట్నెస్తో ఇషాన్ కిషన్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించేందుకు రెడీ అవడంతో ఇండియా బలం పెరిగింది. అయితే మిడిలార్డర్ ఫెయిల్యూర్ జట్టును ఇబ్బంది పెడుతోంది. టోర్నీకి ముందు అద్భుతమైన ఫామ్లో ఉన్న బ్యాటింగ్ లైనప్, గత రెండు మ్యాచ్ల్లో కుప్పకూలే ప్రమాదాన్ని ఎదుర్కొంది. సూర్యకుమార్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా వ్యక్తిగత పెర్ఫామెన్స్లే జట్టును ఆదుకున్నాయి.
కానీ పాకిస్తాన్ వంటి నాణ్యమైన బౌలింగ్ ఎటాక్ ఉన్న జట్టుపై ఒకరిద్దరి ఆట సరిపోదు. ముఖ్యంగా 7 నుంచి 16 ఓవర్ల మధ్య ఇండియా బ్యాటర్లు సింగిల్స్, డబుల్స్ తీయడంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ గ్రౌండ్లో గెలిచిన జట్లన్నీ వికెట్ల మధ్య పరుగెత్తడం ద్వారానే 25 శాతం రన్స్ రాబట్టాయి. ఇండియా కూడా ఇదే వ్యూహంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక, కొలంబో పిచ్ స్వభావం దృష్ట్యా, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చేశాడు. పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్పై ఉన్న మంచి రికార్డు, గత ఆసియా కప్లో పాక్పై తన పెర్ఫామెన్స్ ( 4/30) ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
