- టీ ఫైబర్తో మారుమూల పల్లెలకూ డిజిటల్ సేవలు
- రూ.300కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఓటీటీ
- రాబోయే ఆరు నెలల్లో అందుబాటులోకి
- రెండేండ్లలో కోటి ఇండ్లకు చేరాలనే లక్ష్యం
- మస్క్ ‘స్టార్ లింక్’తోనూ సర్కారు మంతనాలు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో ఊరూరా డిజిటల్ వెలుగులు విరజిమ్మనున్నాయి. పట్టణాలకే పరిమితమైన హైస్పీడ్ ఇంటర్నెట్ ఇకపై మారుమూల గ్రామాల్లో ప్రతిగడపనూ తట్టనున్నది. ప్రజలకు అత్యంత చౌకగా బ్రాడ్బ్యాండ్ సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘టీ -ఫైబర్’ (తెలంగాణ ఫైబర్ గ్రిడ్) ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తున్నది. రాబోయే 6 నుంచి 12 నెలల కాలంలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ హై స్పీడ్ ఇంటర్నెట్సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి ఇంటికీ సెట్టాప్ బాక్స్, స్పెషల్ డేటా ప్లాన్లను ప్రభుత్వం రెడీ చేస్తున్నది. అధికారులు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన 4 గ్రామాల్లో ఇప్పటికే సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నారు. రెండేండ్లలో రాష్ట్రంలోని మూలమూలకూ ఇంటర్నెట్ సేవలు విస్తరించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ప్రాథమికంగా కేవలం రూ.300కే కేబుల్ టీవీ, ఇంటర్నెట్తోపాటు పదుల సంఖ్యలో ప్రభుత్వ సేవలను ఒకే గొడుగు కిందికి తెచ్చేలా కార్యాచరణ సిద్ధం చేశారు.
అవసరమైతే ఇంటికి 1 జీబీపీఎస్ (గిగా బైట్స్పర్ సెకన్) స్పీడ్ ఇచ్చేందుకూ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాన్మస్క్కు చెందిన స్టార్ లింక్తోనూ రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నది. అంతా అనుకున్నట్లు జరిగితే రెండేండ్ల తర్వాత రాష్ట్రం ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది.
సాదాసీదా ఇంటర్నెట్ కాదు..
టీ -ఫైబర్ ఇంటర్నెట్అంటే ఇంటికి ఇంటర్నెట్, ఫోన్లో డేటా వాడుకోవడం మాత్రమే కాదు. ప్రభుత్వం ఇచ్చే ఈ ఒక్క సెట్టాప్ బాక్స్ ఇంట్లో ఉంటే, ీవీని ఒక కంప్యూటర్లా, ఒక మీ-సేవా కేంద్రంలా మార్చేస్తుంది. ఓటీటీలతో పాటు దాదాపు 50కు పైగా సేవలు ఇంట్లోనే పొందవచ్చు. టీవీలోనే యూట్యూబ్ క్లాసులు వినవచ్చు. వైద్య సేవలు పొందవచ్చు. అంతేకాదు, ‘వర్చువల్ డెస్క్టాప్’ ద్వారా టీవీని కంప్యూటర్లా వాడుకునే అవకాశం ఉంది. సిగ్నల్ లేనిచోట కూడా ఇంటర్నెట్ ద్వారా ఫోన్ కాల్స్ మాట్లాడుకునే సదుపాయం ఉంటుంది. విద్యార్థులు, రైతులు, సామాన్యులు తమ మొబైల్ ఫోన్లలోనే ప్రభుత్వ సేవలను వేగంగా పొందే వీలు కలుగుతుంది.
యువతకు ఉపాధి.. పెరగనున్న ఐటీ ఎగుమతులు
ఈ డిజిటల్ గ్రిడ్ రాకతో రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం మారిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ ఆధారిత ఉపాధి అవకాశాలు మెరుగుపడ్తాయని భావిస్తున్నారు. యువత ఉన్నచోటు నుంచే ఐటీ కొలువులు చేసుకునే వీలు కలుగుతుంది. డిజిటల్ ఎంటర్ప్రైజెస్ ఏర్పాటుకు, ఐటీ ఎగుమతులకు ఈ నెట్వర్క్ పెద్ద ఊతం ఇవ్వనుంది. అన్ని వ్యాపారాలకు ఆన్లైన్ వేదికగా మారడం వల్ల ఉత్పాదకత పెరుగుతుంది. సంక్షేమ పథకాలు, సేవలు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వేగంగా, పారదర్శకంగా ప్రజలకు చేరుతాయని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ప్రైవేట్ ఇంటర్నెట్ సంస్థలు నగరాలు, పట్టణాలకే పరిమితమవుతున్నాయి. కానీ టీ- ఫైబర్ ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండటం వల్ల పల్లెలకు సైతం అత్యంత తక్కువ ధరకు హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందనున్నాయి. ప్రభుత్వం అందించే ప్రైమరీ ప్లాన్ రూ. 300 ఉండనుంది. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
ఇక ఇండ్లకు అనుసంధానించడమే..
రాష్ట్రంలో టీ-ఫైబర్ ప్రాజెక్టు విస్తృతి ఊహించని స్థాయిలో ఉంది. రాష్ట్రంలోని 10 జోన్లు (33 జిల్లాలు), 589 మండలాలు, 12,769 గ్రామ పంచాయతీలు, 141 పట్టణ ప్రాంతాలను ఇది ఏకం చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని 63 లక్షల కుటుంబాలు, పట్టణాల్లోని 30 లక్షల ఇండ్లకు అంటే దాదాపు కోటి ఇండ్లకు ఈ నెట్వర్క్ చేరువ కానున్నది. ప్రస్తుతం పంచాయతీల వరకు టీ ఫైబర్ కేబుల్స్ వెళ్లాయి. ప్రతి పంచాయతీ నుంచి ఆ గ్రామంలోని అన్ని ఇండ్లకు, ఇతర కార్యాలయాలకు అనుసంధానిస్తారు. కేవలం నివాసాలకే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 97,115 ప్రభుత్వ సంస్థలను కనెక్ట్ చేయడానికి జాబితా సిద్ధమైంది. ఇందులో విద్య, వైద్యం, హోమ్ శాఖ, వ్యవసాయం, పంచాయతీరాజ్ లాంటి కీలక విభాగాలకు చెందిన 55 వేల కార్యాలయాలను ప్రాధాన్యత క్రమంలో అనుసంధానిస్తున్నారు.
వైర్ తెగినా ఇంటర్నెట్ ఆగదు..
మిషన్ భగీరథ పైప్లైన్లలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ (ఓఎఫ్సీ) వేయడం ద్వారా ప్రభుత్వం భారీగా ఖర్చు తగ్గించుకుంది. ఈ కేబుల్స్ దాదాపు 30 ఏండ్లపాటు చెక్కుచెదరకుండా ఉంటాయి. అంతరాయం కలిగినా ‘రింగ్ అండ్ మెష్’ ఆర్కిటెక్చర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అంటే ఒక చోట వైర్ దెబ్బతిన్నా.. ఇంటర్నెట్కు అంతరాయం ఉండదు. ఇండ్ల కోసం 4 ఎంబీపీఎస్ నుంచి 500 ఎంబీపీఎస్ వరకు వేగంతో డేటా లభిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు వ్యాపార సంస్థల డిమాండ్ను బట్టి 20 ఎంబీపీఎస్ నుంచి 1 జీబీపీఎస్ వరకు కనెక్టివిటీని అందిస్తారు. మండల స్థాయిలో 40 జీఎంపీఎల్ఎ రింగ్, గ్రామ పంచాయతీ స్థాయిలో 10 జీఎంపీఎల్ఎస్ రింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ భారీ నెట్వర్క్ను పర్యవేక్షించేందుకు హైదరాబాద్లో అత్యాధునిక ‘టీ-ఫైబర్ నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్’ ఏర్పాటైంది. ఎక్కడైనా సాంకేతిక లోపం తలెత్తినా, సెక్యూరిటీ ముప్పు పొంచి ఉన్నా వెంటనే పరిష్కరిస్తారు.
ప్రధానంగా అందబోయే సేవలు
- ఒకే కనెక్షన్తో టీవీ చానెల్స్ అన్నీ హై క్వాలిటీతో చూడవచ్చు. ఓటీటీ(నెట్ఫ్లిక్స్, ఆహా, అమెజాన్ ప్రైమ్ తదితర)ల్లో సినిమాలు, వెబ్ సిరీస్లను నేరుగా చూసుకోవచ్చు. బఫరింగ్ (లోడింగ్) అనే గొడవ లేకుండా సినిమాలు స్పీడ్గా ప్లే అవుతాయి.
- క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏదైనా ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నా మీ-సేవా సెంటర్ల దగ్గర గంటల కొద్దీ క్యూలో నిలబడాల్సిన పనిలేదు. టీ-ఫైబర్ బాక్స్ ద్వారా ఇంట్లోనే కూర్చుని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ సేవలు నేరుగా ఇంటికే వస్తాయి.
- ఈ నెట్వర్క్ ద్వారా ఊరిలోని ప్రధాన కూడళ్లలో వైఫై హాట్స్పాట్లు ఉంటాయి. మీ ఇంటి దగ్గర లేదా ఊరి వీధుల్లో సెక్యూరిటీ కోసం సీసీ కెమెరాలు పెట్టుకుంటే, వాటిని ఈ ఇంటర్నెట్తో అనుసంధానించవచ్చు. ఎక్కడ ఉన్నా ఊరిని, ఇంటిని ఫోన్లోనే చూసుకోవచ్చు.
- చాలామందికి కంప్యూటర్ కొనడం ఆర్థికంగా భారం కావచ్చు. కానీ టీ-ఫైబర్ బాక్స్ ఉంటే, మీ టీవీకే కీబోర్డ్, మౌస్ తగిలించుకుని ఒక కంప్యూటర్లా వాడుకోవచ్చు. ఇంటర్నెట్ ద్వారా సాఫ్ట్వేర్ పనులు చేసుకోవడం, టైపింగ్ నేర్చుకోవడంలాంటివి సులభంగా చేయవచ్చు.
- ఏదైనా వ్యాధి వస్తే హైదరాబాద్కో, జిల్లా కేంద్రాలకో పరుగెత్తాల్సిన పనిలేదు. ఈ బాక్స్ ద్వారా టీవీలోనే వీడియో కాల్ చేసి పెద్ద ఆసుపత్రుల్లోని స్పెషలిస్ట్ డాక్టర్లను సంప్రదించవచ్చు. మీ రిపోర్టులు చూపి, వారి సలహాలు తీసుకోవచ్చు.
