
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 33 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు అడిషనల్ కలెక్టర్లుగా ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు రెవెన్యూ కార్యదర్శి లోకేశ్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం పదోన్నతులు కల్పించామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరికి రూ.96,890 నుంచి రూ.1,58,380 వరకు వేతన స్కేల్ ఉంటుందని వెల్లడించారు. పదోన్నతులు కల్పించినందుకు డిప్యూటీ కలెక్టర్ల సంఘం హర్షం వ్యక్తం చేసింది.
సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రభుత్వ పెద్దలకు డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.లచ్చిరెడ్డి, కె.రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ త్వరలోనే కొత్త ఆరోగ్య పథకాన్ని అమల్లోకి తెస్తామని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ తెలిపారు. శనివారం తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి సారథ్యంలో జేఏసీ నాయకులు మంత్రి దామోదరను కలిశారు. రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగికి క్యాష్లెస్ ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని మంత్రిని లచ్చిరెడ్డి కోరారు.