- 27,960 వార్డులకు 67,893 మంది పోటీ
- పెద్దసంఖ్యలో నామినేషన్ల ఉపసంహరణ
- నల్గొండ జిల్లాలో అత్యధికంగా,
- ములుగులో అత్యల్పంగా అభ్యర్థులు
- తుది జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం
- ఏకగ్రీవాల్లో 95 శాతం కాంగ్రెస్ మద్దతుదారులే
హైదరాబాద్, వెలుగు: తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో తుది జాబితా ఖరారైంది. మొదటి విడతలో నోటిఫై చేసిన సర్పంచ్, వార్డు స్థానాలకు మొత్తం 81,020 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇందులో సర్పంచ్ పదవులకు 13,127 మంది, వార్డు సభ్యుల స్థానాలకు దాదాపు 67,893 మంది పోటీలో ఉన్నారు. మొదటి విడతలో జిల్లాలవారీగా పోటీలో ఉన్న సర్పంచ్లు, వార్డు అభ్యర్థుల వివరాలను స్టేట్ ఎలక్షన్ కమిషన్ గురువారం రాత్రి వెల్లడించింది. నల్గొండనుంచి అత్యధికంగా అభ్యర్థులు పోటీలో ఉండగా, ములుగు జిల్లాలో అత్యల్పంగా ఉన్నారు.
3,836 సర్పంచ్ స్థానాలకు ఎలక్షన్
తొలి విడతలో మొత్తం 4,236 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. ఇందులో 5 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ఇక 395 చోట్ల సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 3,836 సర్పంచ్ స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 13,127 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. ఈ విడతలో మొత్తం 37,440 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 149 చోట్ల నామినేషన్లు రాలేదు. రికార్డు స్థాయిలో 9,331 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 27,960 వార్డు స్థానాలకు పోలింగ్ జరుగనున్నది. వార్డులకు 67,893 మంది బరిలో ఉన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక పోటీ ఉన్న జిల్లాల్లో నల్గొండ అగ్రస్థానంలో నిలిచింది. నల్గొండ జిల్లాలో 318 పంచాయతీలకు 988 మంది, కామారెడ్డిలో 167 పంచాయతీలకు 733, వికారాబాద్ జిల్లాలో 262 పంచాయతీలకు 683 మంది బరిలో నిలిచారు. ములుగు జిల్లాలో 48 పంచాతీయలకు 145 మంది, నారాయణపేట జిల్లాలో 67 పంచాయతీలకు 156, జయశంకర్ భూపాలపల్లిలో 82 పంచాయతీలకు 259 మంది పోటీలో ఉన్నారు. ఇక వార్డుల విషయానికొస్తే.. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 2,870 వార్డులకుగానూ 6,020 మంది, వికారాబాద్ జిల్లాలో 2,198 వార్డులకు 3,953 మంది, రంగారెడ్డి జిల్లాలో 1,530 వార్డులకు 3,379 మంది పోటీలో నిలిచారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 974 వార్డులకు 437 మంది, ములుగులో 420 వార్డులకు 753 మంది, నారాయణపేటలో 572 వార్డులకు 834 మంది పోటీలో ఉన్నారు.
మూడో విడత నామినేషన్లకు నేడు ఆఖరు..
మూడో విడత నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు విజయవంతంగా ముగిసింది. అయితే, రెండు రోజులు సర్పంచ్, వార్డులకు ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయనేది ఇంకా క్లారిటీ లేదు. శుక్రవారం మూడో విడత నామినేషన్ల కూడా ముగియనున్నాయి. కాగా, గురువారం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కుముదిని, సెక్రటరీ మకరందు, పీఆర్, ఆర్డీ డైరెక్టర్ సృజన నాలుగు జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
సర్పంచ్ 8,095.. వార్డులకు 9,626 మంది ఉపసంహరణ
మొదటి విడతలో 4,236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా.. సర్పంచ్ కోసం వేసిన నామినేషన్లలో 8,095 మంది తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి 9,626 మంది రేసు నుంచి తప్పుకున్నారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్ జిల్లాల్లో ఎన్నికల వేడి ఎక్కువగా కనిపిస్తున్నది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో సర్పంచ్ స్థానాలకు పోటీ పడిన వారిలో రికార్డు స్థాయిలో 959 మంది విత్ డ్రా చేసుకోగా, వార్డు సభ్యుల స్థానాల నుంచి 1,630 మంది తప్పుకున్నారు. నల్గొండ తర్వాత సూర్యాపేట జిల్లాలో 623 మంది, వికారాబాద్ జిల్లాలో 539 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ నుంచి విరమించుకున్నారు. మరోవైపు కొన్ని జిల్లాల్లో ఉపసంహరణల సంఖ్య తక్కువగా నమోదైంది. వార్డు సభ్యుల విషయానికి వస్తే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా 67 మంది మాత్రమే పోటీ నుంచి తప్పుకున్నారు.
కాంగ్రెస్ మద్దతుదారుల హవా..
తొలి విడత పంచాయతీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో పల్లెపోరులో ప్రచారం జోరందుకున్నది. ఏ గ్రామంలో ఎంతమంది బరిలో నిలిచారో తేలిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని గ్రామాలు ఏకగ్రీవమయ్యాయో లెక్క తేలింది. పల్లెల్లో ఏకగ్రీవాల్లో అధికార కాంగ్రెస్ మద్దతుదారులు సత్తాచాటారు. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ సపోర్టర్స్ఎన్నికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. ఇందులో 95 శాతానికి పైగా స్థానాలను కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే కైవసం చేసుకోవడం విశేషం. నిజామాబాద్ జిల్లాలో 29 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. ఇందులో కాంగ్రెస్ 25, బీఆర్ఎస్ ఒకటి, ఇతరులు 3 కైవసం చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో 20 ఏకగ్రీవం కాగా.. ఇందులో కాంగ్రెస్ 19, సీపీఐ ఒకటి.. నల్గొండలో 22 ఏకగ్రీవం కాగా.. ఇందులో 19 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్ దక్కించుకున్నాయి. సిద్దిపేట జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకున్నది. ఇక్కడ 16 స్థానాలు ఏకగ్రీవం కాగా.. 9 చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులున్నారు. కాగా, కాంగ్రెస్ అధికారంలో ఉండటం, మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీబీ చైర్మన్లు, ఇతర పార్టీ పెద్దల మద్దతుతో కాంగ్రెస్ శ్రేణులు గ్రామాల్లో విజయకేతనం ఎగురవేశారు. పోటీలో ఉన్న ఇతర పార్టీల అభ్యర్థులను, రెబల్స్ను బుజ్జగించడంలో సక్సెస్ అయ్యారు. నారాయణపేట, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల జిల్లాల్లో ఏకగ్రీవమైన అన్ని స్థానాలూ కాంగ్రెస్ దక్కించుకున్నది. నారాయణపేటలో 14కు 14, భూపాలపల్లిలో 9కి 9 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది.
