
- ముంబైలో ఘటన.. 9 మందికి తీవ్ర గాయాలు
- ఫుట్బోర్డుపై ప్యాసింజర్ల జర్నీ.. మూలమలుపు వద్ద దగ్గరగా వచ్చిన రెండు రైళ్లు
- ఒకరి బ్యాగులు మరొకరికి తగలడంతో ప్రమాదం.. ట్రాక్పై పడిపోయిన ప్రయాణికులు
- సబర్బన్ రైళ్లకు ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్ ఏర్పాటుకు రైల్వే శాఖ నిర్ణయం
ముంబై: మహారాష్ట్రలోని థానె జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. లోకల్ ట్రైన్ నుంచి జారిపడి నలుగురు ప్రయాణికులు చనిపోయారు. సోమవారం ఉదయం 9.30 గంటల సమయంలో ముంబ్రా, దివా స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని రైల్వే పోలీసులు కాల్వా హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు రైళ్లు ఆపోజిట్ డైరెక్షన్లో క్రాస్ అవుతుండగా.. ఫుట్బోర్డుపై ఉన్న ప్యాసింజర్లు ఒకరికొకరు తగిలి కిందపడి చనిపోయినట్లు రైల్వే అధికారులు వివరించారు. మృతులందరూ 30 నుంచి 35 ఏండ్ల మధ్యవాళ్లే అని తెలిపారు. ఒక ట్రైన్ ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్ (సీఎస్టీ) ముంబై నుంచి కాసారాకు బయల్దేరింది.
మరో లోకల్ ట్రైన్ కాసారా నుంచి సీఎస్టీకు వెళ్తున్నది. 2 లోకల్ ట్రైన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. కొందరు ఫుట్బోర్డుపై నిలబడి ప్రయాణిస్తున్నారు. ముంబ్రా, దివా స్టేషన్ల మధ్య 2 ట్రైన్లు స్పీడ్గా క్రాస్ అవుతున్నాయి. మూల మలుపు ఉండటంతో ఫుట్బోర్డుపై ప్రయాణిస్తున్న 2 ట్రైన్లలోని ప్యాసింజర్ల వీపులకు ఉన్న బ్యాగులు.. ఒకటితో ఒకటి గీసుకుపోయాయి. దీంతో ఫుట్బోర్డుపై ఉన్న 13 మంది ప్రయాణికులు కిందపడిపోయారు. ఇది గమనించిన కాసారా వెళ్లే ట్రైన్ గార్డు.. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి అంబులెన్స్తో చేరుకున్న రైల్వే సిబ్బంది.. గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించగా.. అందులో నలుగురు
అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.
మృతుల కుటుంబాలకు సీఎం ఫడ్నవిస్ సంతాపం
ముంబైలో నడిచే అన్ని సబర్బన్ ట్రైన్లకు ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తామని రైల్వే బోర్డు అధికారులు ప్రకటించారు. ఇప్పుడున్న ట్రైన్లకు కూడా వీటిని అమరుస్తామని తెలిపారు. ముంబైలో ప్రతి రోజు సుమారు 75 లక్షల మంది లోకల్ ట్రైన్లలో ప్రయాణిస్తుంటారు. ప్రమాదం కారణంగా సెంట్రల్ రైల్వే లైన్లోని కొన్ని లోకల్ ట్రైన్ సర్వీసులను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రమాద ఘటనపై సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలతో పాటు గాయపడినవాళ్లను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు.
ఘటనపై విచారణకు ప్రతిపక్షాల డిమాండ్
ప్రమాద ఘటనపై కమిటీ వేసి ఎంక్వైరీ చేయించాలని, అప్పుడే నిజమేంటో తెలుస్తదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఓవర్ క్రౌడింగ్ నివారించేందుకు అన్ని సబర్బన్ రైళ్లల్లో ఆటోమేటిక్ క్లోజింగ్ డోర్ సిస్టమ్ అమలు చేయాలని ఎన్సీపీ(ఎస్పీ) ప్రెసిడెంట్ శరద్ పవార్ అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని శివసేన(యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆరోపించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించాలని, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తన పదవికి రిజైన్ చేయాలని కాంగ్రెస్ మహారాష్ట్ర చీఫ్ హర్షవర్ధన్ డిమాండ్ చేశారు.