
ఏసీ మెషిన్లో నుంచి పాము పిల్లలు బయటపడిన విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. మీరట్ జిల్లాలోని ఖంకర్ఖేరా పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న పావ్లీ కుర్ద్ గ్రామంలోని శ్రద్ధానంద్ అనే రైతు ఇంట్లో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. శ్రద్ధానంద్ సోమవారం రాత్రి బయటకెళ్లి ఇంట్లోకి వస్తుండగా.. వరండాలో ఓ పాము పిల్ల కనిపించింది. దాన్ని శ్రద్ధానంద్ తీసి ఇంటి బయట పడేసివచ్చాడు. ఆ తర్వాత కాసేపటికి శ్రద్ధానంద్ పడుకుందామని బెడ్రూమ్లోకి వెళ్లాడు. అక్కడ బెడ్ మీద మరో మూడు పాము పిల్లల్ని చూశాడు. ఈ సారి వాటిని తీసి పడేయకుండా.. అవి ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలుసుకోవాలిని అటూ ఇటూ చూశాడు. పాము పిల్లలు ఎక్కడ నుంచి వస్తున్నాయో చూసి శ్రద్ధానంద్ షాక్కు గురయ్యాడు. ఆ గదిలో కొన్ని రోజులుగా వాడకుండా ఒక ఏసీ ఉంది. ఆ ఏసీ పైపు నుంచి మరికొన్ని పాము పిల్లలు బయటకు రావడాన్ని అతను గమనించాడు. వెంటనే కుటుంబసభ్యుల సాయంతో ఏసీ శ్రద్ధానంద్.. ఏసీ మెషిన్ కవర్ తొలగించాడు. అందులో నుంచి దాదాపు 40 పాము పిల్లలు బయటపడ్డాయి. విషయం తెలిసిన స్థానికులు పాము పిల్లల్ని చూడటానికి శ్రద్ధానంద్ ఇంటికి వచ్చారు. వారందరి సాయంతో ఆ పాము పిల్లలన్నింటిని ఓ బ్యాగులో వేసుకుని ఊరు బయట అడవిలో వదిలేసి వచ్చారు. గత కొన్ని నెలలుగా ఏసీని వాడకపోవడం వల్ల.. తల్లి పాము ఏసీ మెషిన్లో గుడ్లు పెట్టి ఉంటుందని.. ఇప్పుడు ఆ గుడ్ల నుంచి పిల్లలు బయటకు వచ్చినట్లు స్థానిక వెటర్నరీ డాక్టర్ వత్సల్ అభిప్రాయపడ్డారు.
For More News..