కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఐదు కోఆప్షన్ స్థానాలకు తీవ్ర పోటీ నెలకొంది. గురువారంతో దరఖాస్తు గడువు ముగియగా 45 అప్లికేషన్లు దాఖలయ్యాయి. 17,18,19 తేదీల్లో స్క్రూటినీ చేయనున్నారు. ఈ నెల 31లోపు జరిగే సమావేశంలో కోఆప్షన్ ఎన్నిక జరగనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రస్తుతం కార్పొరేషన్లో బలాబలాలను పరిశీలిస్తే మెజార్టీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ ఏకమైతే ఒకటి, రెండు స్థానాలు గెలిచే అవకాశముంది.
బీఆర్ఎస్ నుంచి అత్యధిక అప్లికేషన్లు
కార్పొరేషన్ పాలకవర్గంలో బీఆర్ఎస్కు బలం లేకున్నా దరఖాస్తులు సమర్పించినవారిలో 16 మంది బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లే ఉండడం గమనార్హం. మాజీ కార్పొరేటర్లు జంగిలి సాగర్, జంగిలి ఐలేందర్ యాదవ్, దిండిగాల మహేశ్, గందె మాధవి, సర్దార్నీ కమల్జీత్ కౌర్, భూక్యా తిరుపతి, భూక్య లావణ్య ఉన్నారు. చేతులు ఎత్తే విధానంతోనే ఎన్నిక జరగనుండగా.. ఒక వేళ సీక్రెట్ ఓటింగ్ జరిగితే క్రాస్ ఓటింగ్తో తాము గెలుస్తామన్న ధీమాతో కొందరు ఆశావహులు ఉన్నారు.
బీజేపీ తరఫున జనరల్ విభాగం నుంచి కన్న కృష్ణ, నందకుమార్, జనరల్ మహిళా విభాగం నుంచి చిగిరి వెంకటమ్మ, మైనారిటీ విభాగం నుంచి బల్బీర్ సింగ్, మైనార్టీ మహిళా విభాగం నుంచి హఫీజాబేగం ఆ పార్టీ మద్దతును ఆశిస్తున్నారు. వీరినే బీజేపీ బలపరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి మాజీ కౌన్సిలర్లు అర్ష మల్లేశం, అర్ష కిరణ్మయితోపాటు మరో మైనార్టీ నేత కోఆప్షన్ పదవిని ఆశిస్తూ దరఖాస్తులు సమర్పించారు.

