ఆడుకుంటూ వెళ్లి .. పాడుబడ్డ బావిలో పడిన బాలుడు

ఆడుకుంటూ వెళ్లి .. పాడుబడ్డ బావిలో పడిన బాలుడు
  • గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెతికినా లభించని ఆచూకీ  

శంషాబాద్, వెలుగు: ఆడుకుంటూ వెళ్లిన ఓ బాలుడు పాడుబడ్డ బావిలో పడిపోయాడు. గజ ఈతగాళ్లు,  ఎన్డీఆర్ఎఫ్​సిబ్బంది వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ ఘటన మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్​కు చెందిన చందన్​కుమార్​దంపతులు తమ ఇద్దరు కుమారులతో కలిసి కొన్నేళ్ల క్రితం లక్ష్మీగూడ బాంబే కాలనీకి వచ్చారు. ఇక్కడే ఉంటూ కూలీ పని చేసుకుంటున్నారు. వీరి పెద్ద కొడుకు ప్రిన్స్​కుమార్(5) మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బయటకు వచ్చాడు. 

ఆడుకుంటూ వెళ్లి, పాడుబడ్డ బావిలో పడిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో బావిలో గాలించారు. అయినా బాలుడి జాడ తెలియకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్​సిబ్బందిని రంగంలోకి దించారు. రాత్రి 9 గంటల వరకు వెతికినా ఆచూకీ లభించలేదు. బావిలో నీరు ఎక్కువగా ఉండడంతో మోటార్ల సహాయంతో తొలగిస్తున్నారు. బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఆ చిన్నారి ఒక్కడే బావి వద్దకు వెళ్లాడా, వెంట ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.