
- ఫలితాలు రిలీజ్ చేసిన టీజీసీహెచ్ఈ చైర్మన్
- ఈ నెల10 నుంచి అడ్మిషన్ కౌన్సెలింగ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల పరిధిలో పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ సీపీగెట్ –2025 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. దీంట్లో 93.83శాతం మంది క్వాలిఫై అయ్యారు. సోమవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లో టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, ఓయూ వీసీ కుమార్ ఫలితాలను రిలీజ్ చేశారు. గత నెల 4 నుంచి 11 వరకు జరిగిన సీపీగెట్44 సబ్జెక్టుల పరీక్షలకు 62,806 మంది దరఖాస్తు చేసుకోగా, 54,692 మంది హాజరయ్యారు. వీరిలో 51,317 మంది క్వాలిఫై అయ్యారు. అర్హత సాధించిన వారిలో 18,573 మంది అబ్బాయిలు, 32,743 మంది అమ్మాయిలు ఉన్నారు.
సీపీగెట్ ద్వారా ఓయూ, కేయూ, పాలమూరు, తెలంగాణ, మహాత్మాగాంధీ, శాతవాహన, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా, జేఎన్టీయూ, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ తదితర వర్సిటీల్లోని పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించనున్నారు. ఫలితాలు, ర్యాంకు కార్డులను www.osmania.ac.in, https://cpget.tgche.ac.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ నెల 10 నుంచి అడ్మిషన్ కౌన్సెలింగ్ ఉంటుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ వైస్ చైర్మన్లు పురుషోత్తం, మహమూద్, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్, మహిళా వర్సిటీ వీసీ సూర్య ధనుంజయ, సీపీగెట్ కన్వీనర్ పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సగం కోర్సులకు పోటీ లేదు..పీజీలో 51 పీజీ కోర్సులకు సీపీగెట్ నిర్వహించగా, దీంట్లో ఏడు కోర్సులకు టెస్టు కూడా పెట్టలేదు. మిగిలిన వాటిలో సగం కోర్సులకు క్వాలిఫై అయిన వారి కంటే సీట్లే ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 253 పీజీ కాలేజీల్లో 41,709 సీట్లున్నాయి. ఎంకామ్లో 6,562 సీట్లుంటే 3,858 మంది, ఎంఎస్సీ కెమిస్ర్టీలో 3,607 సీట్లకు 3,291 మంది, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్లో 2,950 సీట్లకు 1,936 మంది, ఎంఎస్సీ మ్యాథ్స్లో 3,648 సీట్లకు 2,070 మంది, ఎంఎస్సీ ఫిజిక్స్ లో 1,767 సీట్లకు 1,122 మంది, ఎంఎస్డబ్ల్యూలో 1,280 సీట్లకు 818 మంది క్వాలిఫై అయ్యారు. పోటీ లేకపోవడంతో ఎంఏ కన్నడ, అరబిక్, మరాఠీ, పర్షియన్, థియేటర్ ఆర్ట్స్, ఎంఎస్సీ ఎలక్రానిక్స్, సెరికల్చర్ తదితర వాటికి పరీక్షలు పెట్టలేదు.