తెలంగాణలో17 ఎంపీ సీట్లలో 525 మంది పోటీ

తెలంగాణలో17 ఎంపీ సీట్లలో 525 మంది పోటీ
  • రాష్ట్రంలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
  • అత్యధికంగా  సికింద్రాబాద్ బరిలో 45 మంది
  • ఆ తర్వాతి స్థానంలో మెదక్​, చేవెళ్ల, పెద్దపల్లి, వరంగల్
  • అత్యల్పంగా ఆదిలాబాద్ లోక్​సభ స్థానంలో 12 మంది 
  • 12 రోజుల పాటు మరింత హోరెత్తనున్న ప్రచారం 

హైదరాబాద్, వెలుగు:  నామినేషన్ల ఉపసంహరణ తర్వాత రాష్ట్రంలోని 17 పార్లమెంట్​ నియోజకవర్గాల్లో  మొత్తం 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. లోక్​ సభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా వంద  మంది అభ్యర్థులు తమ నామినేషన్లను వాపస్ తీసుకున్నారు. అయితే, అత్యధికంగా సికింద్రాబాద్​ లోక్​సభ స్థానానికి 45 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో మెదక్​, చేవెళ్ల, పెద్దపల్లి, వరంగల్​ స్థానాలు ఉన్నాయి. అత్యల్పంగా ఆదిలాబాద్​ పార్లమెంట్​ స్థానంలో12 మంది పోటీలో నిలిచారు. ప్రధాన పార్టీలు కాంగ్రెస్​, బీజేపీ, బీఆర్ఎస్​ నుంచి ప్రతి లోక్​సభ పరిధిలో ఆయా పార్టీల క్యాండిడేట్స్​ పోటీలో ఉన్నారు. కొన్నిచోట్ల బీఎస్పీ, భువనగిరి నుంచి సీపీఎం అభ్యర్థి బరిలో నిలిచారు. ఈ నెల 17వ తేదీన లోక్​సభ ఎన్నికలకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నోటిఫికేషన్​ రిలీజ్​ చేశారు. ఆ రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ మొదలైంది. 

కాంగ్రెస్​, బీజేపీ, బీఆర్ఎస్​ క్యాండిడేట్లు ముహూర్తాలు చూసుకుని నామినేషన్లు వేశారు. ఏప్రిల్ 25 తేదీ వరకు 839 మంది నామినేషన్లు వేయగా..  26న నామినేషన్ల పరిశీలన పూర్తయింది. స్క్రూటినీ తర్వాత 268 మంది క్యాండిడేట్ల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇందులో ఎక్కువగా ఇండిపెండెంట్​క్యాండిడేట్లు ఉన్నారు.  మందా జగన్నాథంకు బీఎస్పీ బీ ఫామ్​ ఇవ్వకపోవడంతో.. ఆయన నాగర్​కర్నూల్​స్థానంలో వేసిన నామినేషన్​ రిజెక్ట్ అయ్యింది. ప్రజాశాంతి పార్టీ నుంచి  బాబుమోహన్​ వరంగల్​ పార్లమెంట్​ స్థానానికి నామినేషన్​ వేయగా.. స్క్రూటినీలో తిరస్కరణకు గురయ్యింది.  వచ్చే నెల 13వ తేదీన పోలింగ్ జరుగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.

2019తో పోలిస్తే తక్కువే..

2019 పార్లమెంట్​ ఎన్నికలతో చూస్తే ఈసారి ఎక్కువ మంది పోటీలో లేరు. అప్పుడు నిజామాబాద్​ పార్లమెంట్ స్థానానికి గంపగుత్తగా రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇతర స్థానాల్లోనూ అప్పటీ బీఆర్ఎస్​ ప్రభుత్వానికి, ఆ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా నామినేషన్లు ఎక్కువ సంఖ్యలో వేశారు. అయితే ఈ సారి పరిస్థితి అలా లేదు. ఐదు పార్లమెంట్ స్థానాలకు 40కు పైగా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో రెండు ఎస్సీ రిజర్వ్​డ్​ స్థానాలు పెద్దపల్లి, వరంగల్​ ఉన్నాయి. చేవేళ్ల, మెదక్​, సికింద్రాబాద్​లోనూ 40 మంది పైనే పోటీ చేస్తున్నారు. ఇక భువనగిరి, ఖమ్మం, మహబూబ్​నగర్, హైదరాబాద్​ స్థానాల్లో 30కి పైగా మంది బరిలో నిలిచారు. కరీంనగర్, నిజామాబాద్​, మల్కాజ్ గిరి, నల్గొండ, మహబూబాబాద్​ స్థానాల్లో 20 మందికి పైగా క్యాండిడేట్లు పోటీలో ఉన్నారు.  

హోరెత్తనున్న ప్రచారం

నామినేషన్ల ఘట్టం ముగియగా.. అభ్యర్థులు ప్రచారంపై ఫోకస్​పెట్టారు. వచ్చే నెల 13వ తేదీన పోలింగ్​ జరగనుండగా..11వ తేదీ సాయంత్రం ప్రచారానికి తెరపడనుంది. అంటే ప్రచారానికి సరిగ్గా 12 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో క్యాండిడేట్లు క్యాంపెయినింగ్​ను హోరెత్తించనున్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని మొత్తం అన్ని గ్రామాలు తిరిగే పరిస్థితి లేదు. దీంతో ముఖ్యమైన ప్రాంతాలు, హెడ్​ క్వార్టర్స్​లలో మీటింగ్స్​కు అభ్యర్థులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయా పార్లమెంట్ పరిధిలో ముఖ్యమైన లీడర్లతో మీటింగ్ లు ఏర్పాటు చేయించాలని ప్లాన్ చేస్తున్నారు.