
- పిల్లల జాడ కోసం రాత్రంతా నది వద్దే జాగారం చేసిన కుటుంబసభ్యులు, గ్రామస్తులు
- ఒకే కుటుంబానికి చెందిన నలుగురు యువకుల మృతితో కన్నీరుమున్నీరు
- అంబటిపల్లికే చెందిన నలుగురు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు
జయశంకర్ భూపాలపల్లి/మహదేవపూర్, వెలుగు: అప్పటివరకు హుషారుగా తమ కండ్ల ముందే తిరిగిన ఆరుగురు యువకులు ఒక్కసారిగా కానరానిలోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులంతా కన్నీరుమున్నీరయ్యారు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లికి చెందిన యువకులు శనివారం మేడిగడ్డ బ్యారేజీలో ఈతకు వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే. యువకుల జాడ కోసం ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ నదిలో గాలిస్తుండడంతో వారి తల్లిదండ్రులు, బంధువులు రాత్రంతా గోదావరి తీరంలోనే జాగారం చేశారు. ఆదివారం ఉదయం నదిలోంచి బయటకు తీసుకొస్తున్న మృతదేహాలను చూసి బోరున విలపించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు యువకులు ఉండడంతో వారి కుటుంబసభ్యుల రోదనలను ఆపడం ఎవరి తరం కాలేదు.
నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారే..
మేడిగడ్డ బ్యారేజీలో ఈతకు వెళ్లి నీటిలో మునిగి చనిపోయిన ఆరుగురు యువకుల్లో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. వీళ్లు నలుగురిదీ అంబటిపల్లి గ్రామమే. మేడిగడ్డ బ్యారేజికి అతి సమీపంలో ఉన్న అంబటిపల్లికి చెందిన పట్టి వెంకటస్వామి ఇద్దరు కొడుకులు, ఇద్దరు మేనల్లుండ్లు ఈ ఘటనలో చనిపోయారు. వెంకటస్వామికి ఇద్దరు కొడుకులు మధుసూదన్, శివ మనోజ్, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వెంకటస్వామి ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. మృతుడు మధుసూదన్ బీటెక్ చదువుతుండగా అతడి తమ్ముడు శివమనోజ్ పదో తరగతి కంప్లీట్ చేశాడు. చేతికి అంది వచ్చిన ఇద్దరు కొడుకులు చనిపోవడంతో వెంకటస్వామి కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఇదే ఘటనలో మరణించిన తొగరు రక్షిత్.. వెంకటస్వామి చెల్లెలి కొడుకు. రక్షిత్ తండ్రి రాజు హమాలీ పని చేస్తుండగా తల్లి సాంబ కూలి పనులకు వెళ్తుంది. వీరికి రక్షిత్తో పాటు మరో కూతురు ఉంది.
ఒక్కగానొక్క కొడుకు నీటిలో పడి చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మరో మృతుడు కర్నాల సాగర్ కూడా వెంకటస్వామి మరో (కజిన్) చెల్లెలి కొడుకు. సాగర్ తండ్రి సమ్మయ్య వడ్రంగి పని చేస్తుండగా తల్లి కూలీకి వెళ్తుంది. వీరికి సాగర్తో పాటు మరో కుమారుడు, ఒక అమ్మాయి ఉన్నారు. సాగర్ మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంలో చనిపోయిన వారిలో మరో ఇద్దరు కాటారం మండలం కొర్లకుంట, స్తంభంపల్లి పీపీ గ్రామానికి చెందిన వారు.
మృతుల్లో ఒకరైన రాహుల్ హనుమకొండలో కంప్యూటర్స్ నేర్చుకుంటుండగా.. పెండ్లికి హాజరయ్యేందుకు గ్రామానికి వచ్చాడు. ఇతడి తండ్రి శ్రీనివాస్ కొంత భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తుండగా తల్లి కూలి పనులకు వెళ్తోంది. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉండగా సంఘటనలో రాహుల్ మరణించాడు. మరో మృతుడు బొల్లెడ్ల రాంచరణ్ తండ్రి వెంకటస్వామి, తల్లి స్వర్ణలత కూలి పనులు చేసుకుంటున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు, కూతురు ఉండగా పెద్ద కొడుకు రాంచరణ్ పదో తరగతి కంప్లీట్ చేశాడు. శనివారం జరిగిన ఘటనలో చనిపోయాడు.
బోరుమన్న అంబటిపల్లి
ఆరుగురు యువకులు నీటిలో గల్లంతయ్యారని సమాచారం తెలిసిన వెంటనే ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని నదిలో గాలింపు చేపట్టారు. గల్లంతైన వారిలో అంబటిపల్లికి చెందిన వారే నలుగురు యువకులు ఉండడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రాత్రంగా నది ఒడ్డునే ఉన్నారు. ఆదివారం ఉదయం ఒక్కో డెడ్బాడీని బయటకు తీసుకొస్తుంటే యువకులను గుర్తించి బోరున విలపించారు.
మేడిగడ్డ బ్యారేజీ అప్ స్ట్రీమ్లో గల్లంతైన ఆరుగురు యువకుల మృతదేహాలను వెలిగి తీసేందుకు ఆఫీసర్లు 8 గంటల పాటు సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. ఈ రెస్క్యూలో చల్వాయి ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. శనివారం రాత్రి ఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే 36 మంది ఎస్డీఆర్ఎఫ్ బృంద సభ్యులు బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. లైట్ సెట్టింగ్ చేసి రాత్రి ఒంటి గంట వరకు నదిలో గాలించారు. అప్పటివరకు ఎవరి డెడ్బాడీ కూడా దొరకలేదు. తిరిగి ఆదివారం ఉదయం ఐదు గంటలకు గాలింపు మొదలు పెట్టగా 7 గంటలకు మొదటి మృతదేహం దొరుకగా.. మధ్యాహ్నం 12.55కు ఆరో యవకుడి డెడ్బాడీని వెలికితీశారు. ఈ గాలింపులో మొత్తం 10 మంది డీప్ డైవర్స్, 20 మంది స్విమ్మర్లు పాల్గొన్నారు.
ఎస్డీఆర్ఎఫ్ టీమ్ రెండు బోట్లలో తిరుగుతూ, గజ ఈతగాళ్లు నీటిలోకి దిగి నలుగురి మృతదేహాలను బయటకు తీశారు. నీటి లోతుతో పాటు ప్రవాహ వేగం ఎక్కువగా ఉండడంతో మిగతా ఇద్దరినీ కనుగొనడం ఎస్డీఆర్ఎఫ్ టీమ్కు కష్టమైంది. దీంతో ఆఫీసర్లు స్థానికులను సంప్రదించి లోకల్గా చేపలు పట్టే నాయకపోడ్ యువకులను పిలిపించారు. వారు చేపలు పట్టే వలలు వేసి లాగడంతో మిగిలిన రెండు డెడ్బాడీలు కూడా బయటపడ్డాయి. ఆరుగురు యువకుల మృతదేహాలను మహాదేవపూర్ సీహెచ్సీకి తరలించి పోస్ట్మార్టం పూర్తి చేసిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. పట్టి వెంకటస్వామి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు మహదేవపూర్ ఎస్సై పవన్కుమార్ తెలిపారు. కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఏఎస్పీ నరేశ్, డీఎస్పీ రామ్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.