
మొత్తం 4,798 మంది నామినేషన్లు దాఖలు
విత్ డ్రాకు రేపటివరకు అవకాశం
బరిలో నిలిచే అభ్యర్థులు ఎంతమందనేది తేలేది 15వ తేదీనే..
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ ముగిసింది. అన్ని నియోజక వర్గాల్లో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కాగా.. పెద్ద సంఖ్యలోనే నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అన్ని సెగ్మెంట్లలో కలిపి 4,798 మంది నామినేషన్లు వేయగా 608 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. ఈ నెల 15 వరకు నామినేషన్లు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఆ రోజు సాయంత్రానికి ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థుల సంఖ్యపై క్లారిటీ రానుంది. తిరస్కరణకు గురైన నామినేషన్లలో బీఎస్పీ అభ్యర్థులు 8 మంది ఉన్నారు.
స్టేషన్ ఘన్ పూర్(ఎస్సీ)లో నామినేషన్ వేసిన తాళ్ళపల్లి వెంకటస్వామి, పాలకుర్తి నుంచి సింగారం రవీంద్రగుప్త, భువనగిరి నుంచి ఉప్పల జహంగీర్, మిర్యాలగూడ నుంచి జాడి రాజు, ఆలేరు నుంచి గందమల్ల లింగస్వామి, మధిర(ఎస్సీ) నుంచి చెరుకుపల్లి శారద, బహదూర్పుర నుంచి కే.ప్రసన్న కుమారి యాదవ్, గోషామహల్ నుంచి మహ్మద్ కైరుద్దీన్ అహ్మద్ లు ఉన్నారు. దీంతో బీఎస్పీ119 అసెంబ్లీ స్థానాలకు గాను 111 స్థానాల్లోనే తలపడనుంది. అత్యధికంగా సీఎం పోటీ చేస్తున్న గజ్వేల్లో 145 మంది 154 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా 13 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి.
సిరిసిల్లలో అన్ని నామినేషన్లు ఆమోదం పొందాయి. వేములవాడలో 2 నామినేషన్లు, మానకొండూరులో ఏడు నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి 21మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. సరైన పత్రాలులేని కారణంగా ముగ్గురి నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 7 నామినేషన్లు, పాలేరులో 5, సూర్యాపేటలో 10, ఖానాపూర్ లో 4, మంథనిలో 4, కరీంనగర్లో 7, నామినేషన్లను అధికారులు తిరస్కరించారు.