హైదరాబాద్, వెలుగు: రూల్స్ పాటించని 68 ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీలను ఇంటర్బోర్డు మూసేసింది. ఫైర్ ఎన్వోసీ, బిల్డింగ్ పర్మిషన్ లేకపోవడంతో కాలేజీలను సీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, కాలేజీ మేనేజ్మెంట్లకు మెయిల్ ద్వారా మూసివేత నోటీసులు పంపామని బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు. తెలిపింది. మళ్లీ కాలేజీ తెరిస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. 2019–2020 విద్యాసంవత్సరానికి గానూ 1,476 ప్రైవేటు కాలేజీలకు బోర్డు గుర్తింపునిచ్చింది. కొన్ని కాలేజీలు ఎలాంటి గుర్తింపు లేకుండానే కొనసాగుతున్నాయి. దీనిపై గతంలో ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిని విచారించిన హైకోర్టు చర్యలు తీసుకోవాల్సిందిగా బోర్డును ఆదేశించింది. పరీక్షల తర్వాత చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు బోర్డు తెలిపింది. దానికి తగ్గట్టు 68 కాలేజీలకు ఫైర్ ఎన్వోసీ, బిల్డింగ్ పర్మిషన్ లేదని గుర్తించింది. వీటిలో నారాయణ కాలేజీకి చెందిన 26 క్యాంపస్లు, శ్రీచైతన్య 18 క్యాంపస్లు, గాయత్రి 8, ఎన్ఆర్ఐ 5 ఉండగా, మరో 11 కాలేజీలు వేరే మేనేజ్మెంట్ల పరిధిలో ఉన్నాయి. అందులో ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్లోనే ఉన్నాయి. ఫైర్ డిపార్ట్మెంట్ నుంచీ నివేదిక తెప్పించుకుంది బోర్డు. అన్నీ పరిశీలించి ఆయా కాలేజీలన్నింటికీ ఫిబ్రవరి 22న నోటీసులు జారీ చేసింది. నెలరోజులైనా కాలేజీ యాజమాన్యాల నుంచి రిప్లై రాలేదు. దీంతో ఆయా కాలేజీలన్నింటినీ మూసేస్తున్నట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది.
మొత్తం 30 వేల స్టూడెంట్లు..
ఆయా కాలేజీల్లో 30 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో ఫస్టియర్ స్టూడెంట్లు 15 వేల మంది దాకా ఉన్నారు. వాళ్లందరికీ సర్కార్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇప్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సర్కార్ కాలేజీల్లో చేరడం ఇష్టం లేని వాళ్లు వేరే కాలేజీలో చేరేలా ఆప్షన్ పెట్టుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు.