- 37 శాతం మందికి పెట్టుబడులపై జీరో నాలెడ్జ్
- వెల్లడించిన ఫిన్సేఫ్ సర్వే
న్యూఢిల్లీ: ఉద్యోగులు బాగానే పొదుపు చేస్తున్నా, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే విషయంలో మాత్రం వెనకబడుతున్నారని వెల్లడయింది. దాదాపు 70 శాతం మంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారని ఒక సర్వే తెలిపింది. ఫిన్సేఫ్ సంస్థ చేపట్టిన వర్క్ప్లేస్ ఫైనాన్షియల్ వెల్బీంగ్ సర్వే 4,532 మందిని ప్రశ్నించి ఈ నివేదికను రూపొందించింది. దీని ప్రకారం..ఉద్యోగులు పెట్టుబడులూ పెడుతున్నా, చాలా మందికి ప్రాథమిక విషయాలే తెలియడం లేదు.
31 శాతం మంది మాత్రమే ఆర్థిక అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. 45 శాతం మంది పూర్తిగా యజమాని అందించే బీమాపైనే ఆధారపడుతున్నారు. మరో 24 శాతం మంది ఏ ఆధారమూ లేకుండానే బతుకీడుస్తున్నారు. మొత్తం 70 శాతం మందికి ఎమర్జెన్సీలను ఎదుర్కొనేంత డబ్బు లేదు.
వీరిలో చాలా మందికి పెట్టుబడుల ప్రాముఖ్యత తెలిసినా, సరైన విధానాలను పాటించడం లేదు. ఈక్విటీల్లో 58 శాతం మంది ఉద్యోగులు పెట్టుబడులు పెడుతున్నారు. అయితే, 37 శాతం మంది ఇప్పటికీ తమకు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియదని ఒప్పుకున్నారు.
