పద్మారావునగర్, వెలుగు: రాష్ట్రంలో పదేండ్లు సాగిన నియంత, అహంకార పాలకుడిని ఓడించినందుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పార్శీగుట్టలోని ఎమ్మార్పీఎస్ జాతీయ ఆఫీసులో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ మద్దతుతోనే బీజేపీ8 సీట్లు గెలుచుకోగా..14 శాతం ఓట్లు వచ్చాయని తెలిపారు. అన్నిపార్టీల ఓటు శాతం తగ్గితే కాంగ్రెస్, బీజేపీలది మాత్రమే పెరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కంగ్రాట్స్ చెబుతూ, మంత్రి వర్గంలో మాదిగలకు, మాదిగ ఉపకులాలకు ప్రాధాన్యం కల్పించాలని కోరారు.
గత సర్కార్ చేసిన తప్పిదాలు చేయొద్దని సూచించారు. నియంతృత్వంగా కాకుండా ప్రజాస్వామ్య పరిపాలన అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్నేతలు అనుకూలంగా వ్యవహరించలేదని, సృష్టమైన హామీని ఇచ్చిన బీజేపీకి తాము బహిరంగ మద్దతు ఇచ్చామన్నారు. ప్రధాని మోదీ తన హామీని నిలుపుకుంటారని, కచ్చితంగా ఎస్సీ వర్గీకరణ బిల్లు చట్టబద్ధత పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మార్పీఎస్ రాష్ర్ట అధ్యక్షుడు గోవింద్ నరేశ్, నేతలు లక్ష్మణ్, సోమశేఖర్, కొమ్ము శేఖర్, విజయ్, మల్లికార్జున్పాల్గొన్నారు.