
భువనేశ్వర్: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడే వారి వెన్నులో వణుకు పుట్టే ఘటన ఒకటి ఒడిషా రాష్ట్రంలో చోటు చేసుకుంది. లైంగిక వేధింపులకు పాల్పడుతోన్న ఓ 60 ఏళ్ల వృద్ధుడిని 8 మంది మహిళల బృందం అత్యంత దారుణంగా గొంతు కోసి హత్య చేసింది. అనంతరం డెడ్ బాడీని దహనం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి మార్చుకోలేదని.. కాటికి పోయే వయసులో కామ కోరికలతో తమ వేధింపుకులకు గురి చేస్తుండటంతో ఎవరికీ చెప్పుకోలేక చివరకు హత్య చేశామని సదరు మహిళలు పోలీసులకు చెప్పారాంట.
ఈ ఘటనకు సంబంధించి పోలీసుల వివరాల ప్రకారం.. ఒడిశాలోని గజపతి జిల్లా కుయిహురు గ్రామానికి చెందిన కాంబి మాలిక్కు 60 సంవత్సరాలు. భార్య చనిపోవడంతో గత కొంత కాలంగా ఒంటరిగానే ఉంటున్నాడు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా 60 ఏళ్ల వయసులో కూడా కాంబి మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. కొన్ని రోజులుగా కాంబి వేధింపులు తట్టుకుంటే వచ్చినా మహిళలు.. రోజురోజుకు మరీ ఎక్కువ కావడంతో ఇక తట్టుకోలేకపోయారు.
ఎన్నిసార్లు హెచ్చరించినా బుద్ధి మార్చుకోకపోవడంతో ఇక చేసేదేమి లేక కాంబిని కాటికి పంపాలనుకున్నారు. ఇందు కోసం కాంబి చేతిలో లైంగిక వేధింపులకు గురైన 8 మంది మహిళలు ఒక బృందంగా ఏర్పడ్డారు. కాంబి ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడా అని ఎదురు చూశారు. ఈ క్రమంలోనే జూన్ 2న కాంబి కుటుంబం సభ్యులు ఏదో పని మీద బయటకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన మహిళలు బృందం ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తోన్న కాంబిని గొంతు కోసి హత్య చేశారు.
అనంతరం డెడ్ బాడీ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి తగలబెట్టారు. ఇంటికి తిరిగివచ్చిన కాంబి కుమారులు తన తండ్రి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యా్ప్తు చేపట్టగా ఈ విషయం బయటపడింది. కాంబిని హత్య చేసిన 8 మంది మహిళలతో పాటు వీళ్లకు సహరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతం నుంచి కాంబి సగం కాలిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కాంబి తమను పలుమార్లు లైంగిక వేధింపులకు గురి చేశాడని.. ఎన్ని సార్లు హెచ్చరించినా మారకపోవడంతో హత్య చేసినట్లు మహిళలు పోలీసులు విచారణలో చెప్పారంట. మృతుడు కాంబి అనేక మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. కాంబికి గ్రామంలోని కొంతమంది వితంతువులతో అక్రమ సంబంధం ఉన్నట్లు గుర్తించామన్నారు.